హైదరాబాద్: మునుగోడు మొనగాడు సీఎం కేసీఆరేనని టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. ఉపఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ను రాష్ట్రానికే పరిమితం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నిందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన వెంటనే మునుగోడు ఉపఎన్నికలు ముందుకు తెచ్చారని విమర్శించారు. అయితే బీజేపీ కుటిల యత్నాలకు కేసీఆర్ తనదైన రాజకీయ చాణక్య నీతితో చెక్పెట్టారని వెల్లడించారు.
వేల కోట్ల కాంట్రాక్టులు, ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశచూపి నీచ రాజకీయాలు, స్వతంత్ర
అభ్యర్థుల ఎన్నికల గుర్తులను ఏమార్చి మునుగోడు ప్రజలను మోసంచేయాలనుకున్న బీజేపీకి.. టీఆర్ఎస్ విజయం ద్వారా మోదీ, అమిత్ షాలకు ముఖ్యమంత్రి కర్రుకాల్చి వాతపెట్టారని చెప్పారు. కాలంచెల్లిన కాంగ్రెస్, మతతత్వ బీజేపీలకు తెలంగాణలో స్థానం లేదని నిరూపించారు. 2023 సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలతో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించకుండా ఆపడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్కు మరోసారి విజయాన్ని కట్టబెట్టిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.