Group-2 Syllabus | గ్రూప్-2 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. 783 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ గడువు ఫిబ్రవరి 16వ తేదీతో ముగుస్తుంది.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండోసారి గ్రూప్-2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 తర్వాత అంతే క్రేజ్ ఉన్నవి గ్రూప్-2 ఉద్యోగాలు. నాయబ్ తహసీల్దార్, ఏసీటీవో, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎస్ఐ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మండల పంచాయతీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు గ్రూప్-2 ద్వారా భర్తీ చేస్తారు. గత నోటిఫికేషన్ ద్వారా సుమారు 1000 పోస్టులను భర్తీ చేశారు. అదేవిధంగా గత నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ ఉండగా ప్రస్తుతం ఉండదు. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.
ముందుగా అభ్యర్థులకు సిలబస్పై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ప్రతి పేపరుకు సమ ప్రాధాన్యంలో ఎంత సమయాన్ని కేటాయించాలనే ప్రణాళిక తప్పనిసరి. ఎన్ని పుస్తకాలు చదువుతున్నామన్నది కాకుండా ప్రతి పేపరుకు ఏవైనా రెండు మంచి పుస్తకాలు ఎంపిక చేసుకొని చదవడం ఉత్తమం. ప్రిపరేషన్ సమయంలో గ్యాప్ రాకుండా కొనసాగింపుగా చదివితే విజయం తప్పకుండా వరిస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతిరోజు ధ్యానం చేస్తే సరిపోతుంది. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం అవసరమో ముందే నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు నిరంతరం శ్రమించాలి. సామాజిక మాధ్యమాలు, వేడుకలకు వీలైనంత దూరంగా ఉండడం మేలు. ఫోన్లలో మన ప్రిపరేషన్కు సంబంధించిన విషయాల వరకే ప్రాధాన్యం ఇవ్వాలి. స్నేహితులతో వివిధ సబ్జెక్టులపై చర్చించడం వల్ల ఎక్కువగా గుర్తుండి సులభంగా మార్కులు పొందే అవకాశం ఉంది. ప్రశ్నల స్థాయి మారినందున అభ్యర్థులు విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అవడం మంచిది. పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు తడబాటు లేకుండా సమాధానాలను ఎంపిక చేస్తేనే మార్కులు సొంతమవుతాయి. అప్పుడు విజయం మీ ముందు నిలుస్తుంది.
– చంద్రశేఖర్, నాయబ్ తహసీల్దార్, గుమ్మడిదల, సంగారెడ్డి జిల్లా
గ్రూప్-2 పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సిలబస్ మొత్తం కచ్చితంగా చదవాలి. అందులోని అన్ని టాపిక్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ తయారు చేసుకుని అందుకనుగుణంగా ప్రిపేర్ కావాలి. ఒకే సబ్జెక్టు కోసం రెండు కంటే ఎక్కువ పుస్తకాలు చదవితే ఫలితం ఉండదు. తెలుగు అకాడమీతో పాటు ప్రస్తుతం టాప్లో ఉన్న కాంపిటీటివ్ పుస్తకం ఎంచుకొని చదవాలి. ప్రతి పేపర్ను క్షుణ్నంగా చదివి, రివిజన్ చేసుకోవాలి. సబ్జెక్టుపై పూర్తి కమాండింగ్ వచ్చింది అనుకున్నాకే మాక్ టెస్ట్లు రాయాలి. ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే అంత ఎక్కువ పట్టు సాధించవచ్చు. గ్రూప్ డిస్కషన్స్, ఏదైనా ఒక టాపిక్ను ఎంచుకొని దాన్ని విశ్లేషించడం చేయాలి. ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నల సరళి గత పరీక్షల కంటే భిన్నంగా ఉంది. అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాలి. అందుకోసం ఆయా పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ప్రశ్నలు ఎక్కువగా అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి కాబట్టి ఆ తరహాలో ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీ సొంతం అవుతుంది.
– రఘునందన్రెడ్డి, 2nd ర్యాంకర్, గ్రూప్-II