కామారెడ్డిరూరల్, నవంబర్ 11 : భూతగాదాలతో సుపారీ ఇచ్చి అన్నను హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 4 వ తేదీన పాల్వంచమర్రి స్టేజీ వద్ద నిమ్మ మల్లయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి, కత్తితో గొంతు కోసి చంపేశారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్డేటా ఆధారంగా కామారెడ్డి డీఎస్పీ సోమనాథం పర్యవేక్షణలో అనుమానితుడైన యాడారం గ్రామానికి చెందిన అల్లపు రమేశ్ను పట్టుకొని విచారించగా నేరం అంగీకరించి హత్యలో పాల్గొన్న మిగతా వారి పేర్లను వెల్లడించాడు. నిందితుడు వడ్డెర కులానికి చెందిన అల్లెపు రమేశ్ గతంలో 5 దొంగతనం కేసులు, రేప్ అండ్ మర్డర్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు.
కూలీ పని చేసే రమేశ్ సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని వెతుకుతుండగా అతనికి పరిచయస్తుడైన కోనాపూర్ గ్రామానికి చెందిన ఏల దేవరాజు అనే వ్యక్తి ఏల్పుగొండ గ్రామానికి చెందిన నిమ్మ నర్సింహులు అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అన్న మల్లయ్యతో గొడవలు, వివాదం ఉన్నదని అందుకుగాను తన అన్నను చంపాలని నర్సింహులు నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో రమేశ్ పరిచయం కాగా రూ.80 వేలకు నిమ్మ మల్లయ్యను హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 3వ తేదీన నిమ్మ నర్సింహులు రూ.30 వేలు రమేశ్కు అడ్వాన్సుగా ఇచ్చాడు. మిగతా డబ్బులు పని పూర్తయ్యక ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అల్లెపు రమేశ్, తన ఇద్దరు బావమరుదులు పల్లపు శ్రీకాంత్, రమేశ్ పాల్వంచమర్రి వద్దకు వచ్చి ఈనెల 4వ తేదీన రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం రమేశ్, శ్రీకాంత్ ఇద్దరు నిమ్మ మల్లయ్య తలపై కర్రలతో కొట్టి, కత్తితో గొంతు కోసి చంపారు. అదే విధంగా మల్లయ్య వెంట ఉన్న నిమ్మ చిన్న రాములును తలపై కొట్టి గాయపరిచారు.వీరి వద్ద నుంచి రూ.26,500 నగదు, ఆరు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఏ1 నిమ్మ నర్సింహులు, ఏ2 పల్లపు రమేశ్, ఏ3 అల్లెపు రమేశ్, ఏ4 పల్లపు శ్రీకాంత్, ఏ5 ఏల దేవరాజు పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిందితులందరిపైనా జిల్లాతో పాటు ఇతర జిల్లాల పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, కామారెడ్డిరూరల్ సీఐ శ్రీనివాస్, మాచారెడ్డి,రామారెడ్డి ఎస్సైలు సంతోష్కుమార్,అనిల్కుమార్,ఐడీ పార్టీ సిబ్బంది రామస్వామి, రవికిరణ్, రమేశ్, గోపాల్, నరేశ్, సిద్ధిరాములు, సంజీవ్కుమార్ను ఎస్పీ అభినందించారు.