కామారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగా యి. ఎమ్మెల్యేలు ఎం పిక చేసిన మండలాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించగా, అన్ని మండలాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. మహిళలు కొత్త వస్ర్తాలను ధరించి సభలకు హాజరు కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. సభలు ఉత్సాహభరితంగా సాగాయి. కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పాల్గొనగా, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను గంపగోవర్ధన్ వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహంచిన మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొనగా, మహిళలు చదువుకొని తమ కాళ్లపై తాము నిలబడాలని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొనగా, నియోజకవర్గంలో మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే షిండే వివరించి, మహిళలను ఉత్సాహపర్చారు.
బాన్సువాడ నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవాన్ని వర్నిలో నిర్వహించగా, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. జనాభాలో సగం మహిళలే ఉన్నారని, ఢిల్లీకి రాజైనా, తల్లికి మాత్రం కొడుకేనని, మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని స్పీకర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడికి తరలివెళ్లారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
మహిళా దినోత్సవం సందర్భంగా నియోకవర్గ కేంద్రాల్లో భారీ సభలు నిర్వహించి, ఎల్ఈడీలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే ఆయా సభా ప్రాంగణాల్లో పోషక విలువలు ఉన్న రుచికరమైన ఆహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. కొందరు మహిళలు ప్రత్యేక స్టాళ్లలో హ్యాండీక్రాఫ్ట్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళలు దాండియా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ ఆకట్టుకున్నాయి. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి మహిళలను ఉత్సాహపర్చారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవానికి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అనంతరం మహిళలకు భోజనాలను ఏర్పాటు చేశారు. సభలు ఆద్యంతం ఉత్సాహంగా సాగడం విశేషం.