మాచారెడ్డి, ఏప్రిల్ 17 : మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంతో కరెంట్ కష్టాలు తీరిపోయాయి. దీంతో వ్యాపారస్తులు, గృహ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఉమ్మడి మాచారెడ్డి జీపీకి అనుసంధానంగా ఉన్న గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామానికి నిత్యం విద్యుత్ సమస్యలు ఉండేవి. గజ్యానాయక్ తండా గ్రామం వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ దశలో లో వోల్టేజీ సమస్య ఎక్కువైంది. మాచారెడ్డి, చుక్కాపూర్, కొత్తపల్లి, గజ్యానాయక్తండా నాలుగు గ్రామాలకు కలిపి ఒకే విద్యుత్ సబ్స్టేషన్ ఉండగా వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ ఎల్సీ తీసుకున్నా నాలుగు గ్రామాల్లో కరెంట్ కట్ అయ్యేది. చుక్కాపూర్ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు నిత్యం విద్యుత్ సమస్య ఉండేది. గతంలో లో-వోల్టేజీ సమస్య ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయేవి. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేయడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ హంజినాయక్, బీఆర్ఎస్ నాయకులు వరంగల్లోని ఎన్పీడీసీఎల్ ఆపరేషనల్ డైరెక్టర్ నర్సింగ్రావును పలుమార్లు కలిసి విద్యుత్ సమస్యపై విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు ఆధ్వర్యంలో పలు మార్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్ల్లగా వెంటనే మంజూరు చేస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. వేగంగా పనులు పూర్తి చేశారు.
సబ్స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసుకోగా గత నెల 28న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. విద్యుత్ సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఎన్నో ఏండ్ల నుంచి విద్యుత్ సమస్య ఉంది. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన పరిష్కరించలేదు. ఎన్పీడీసీఎల్ ఆపరేషనల్ డైరెక్టర్ నర్సింగ్రావును కలవడం ద్వారా ఈ సమస్య సగం పరిష్కరమైంది. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సబ్స్టేషన్ మంజూరు చేశారు. ఇప్పుడు మా గ్రామానికి ఎటువంటి అటంకం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది.
– లోయపల్లి శ్రీధర్రావు, బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు
గతంలో కరెంట్ ఎప్పుడు పోయేదో మాకు తెలిసేదికాదు. గిరాకీ టైంలో కరెంట్ పోవడంతో చికెన్ సెంటర్ వ్యాపారానికి ఇబ్బందులు పడ్డాం. ఇన్వర్టర్, బ్యాటరీలు తెచ్చుకున్నా దాని బ్యాకప్ సరిపోయేది కాదు. ఇప్పుడు కొత్త సబ్స్టేషన్ నుంచి నిమిషం కరెంట్ పోకుండా ఇస్తున్నారు. షాపులకు ఎటువంటి ఆటంకం లేకుండా కరెంట్ను ఇస్తున్నారు. ఇప్పుడు షాపులో బ్యాటరీలను వాడడం లేదు.
– ఎజాజ్, చికెన్ షాపు నిర్వాహకుడు,గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్