చిక్కడపల్లి, జనవరి 9 : ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సు యజమానులు, ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ సంస్థ నష్టాలను తగ్గించగలిగామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. రాష్ట్ర అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ హాజరై డైరీని ఆవిష్కరించారు. అనంరతం చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ.. అద్దె బస్సు యజమానుల సమస్యలను గతంలోనే పరిష్కరించామని చెప్పారు. ఇతర సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా తర్వాత నష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రతిరోజూ రూ.10 కోట్ల నుంచి రూ. రూ.4 కోట్లకు నష్టాలను తగ్గించగలిగామని వెల్లడించారు.
50 వేల మంది ఉద్యోగులు ఉన్న అతిపెద్ద సంస్థ ఆర్టీసీ అని అన్నారు. ఉద్యోగులు, అద్దె బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా ప్రతి ఏడాది సంస్థకు రూ. 1,500 కోట్లు ఇస్తూ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఆర్టీసీ సంస్థ అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రజల ఆదరణ, సంస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో ఆర్టీసీ పూర్వవైభవం దిశగా దూసుకెళ్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఈడీలు పురుషోత్తం నాయక్, మునిశేఖర్, వినోద్, రాష్ట్ర అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్బ మధుకర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి సత్యం బాబు, ఉపాధ్యక్షుడు రవి, సంయుక్త కార్యదర్శి మాధవ్రెడ్డి, అదనపు కార్యదర్శి జి.రామకృష్ణా రెడ్డి, కార్యదర్శి బాలవర్ధన్రెడ్డి, బస్ బాడీ బిల్డర్స్ అసోసియేసన్ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.