ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఇకనైనా ఎంపీ అర్వింద్ పార్లమెంట్లో నోరు విప్పాలని అన్నదాతలు కోరుతున్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని ఓట్లు వేయించుకొని తప్పించుకుని తిరుగుతున్న ఎంపీ తీరును నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతన్నలు నిలదీస్తూనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతోపాటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న వివక్షపై లోక్సభలో నిలదీయాలంటూ రైతులు కోరుతున్నారు. పంజాబ్లో సేకరించినట్లే తెలంగాణలోనూ వడ్లను కొనేలా కేంద్రాన్ని ప్రశ్నించాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ను రైతులు వెంటాడుతున్నారు. బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు కనీస మద్దతు ధర తీసుకు రావాలంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతన్నలు నిలదీస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చతికిల పడుతున్న ఎంపీ అర్వింద్ చేసేది లేక ముఖం చాటేస్తున్నారు. క్షేత్ర పర్యటనలు మానుకుని హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రానికే పర్యటనలు పరిమితం చేసుకున్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ఓటేసిన ప్రజల కంటికి కనిపించని ఎంపీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేం ద్రం తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పత్తా లేకుండా పోయాడు. పైపెచ్చు వాస్తవాలకు దూరంగా వరి సాగు విషయంలో ప్రకటనలు చేస్తూ రైతులను ఆగం పట్టిస్తున్నాడు. నిత్యం సోష ల్ మీడియాలో, వివిధ మాధ్యమాల్లో లైవ్ షోల పేరిట తళుక్కుమనే ఎంపీ అర్వింద్ను రైతులు, రైతు కుటుంబాలు మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వహిస్తున్న వివక్షపై లోక్సభలో నిలదీయాలంటూ రైతులు కోరుతున్నారు. పంజాబ్లో సేకరించినట్లే రాష్ట్రంలోనూ వడ్లను కొనేలా కేంద్రాన్ని ప్రశ్నించాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ముఖం చాటేసిన అర్వింద్…
బీజేపీ రాష్ట్ర నాయకులు కొంత కాలంగా అబద్ధాలే ఊపిరిగా ప్రచారం చేస్తూ బతుకున్నారు. అందులో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మరింత ఎక్కువగా తప్పుడు లెక్కలతో, వాస్తవ దూరమైన ప్రకటనలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తుండడం నిత్యం చూస్తున్నదే. ధాన్యం సేకరణలోనూ కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని ఎండగడుతూ టీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టింది. కేంద్రం తీరు మార్చుకోవాలంటూ నవంబర్ 12, 22 తేదీల్లో ప్రజాప్రతినిధులంతా రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేశారు. ధాన్యం సేకరించని కేంద్రం తీరుతో పాటు యాసంగిలో వరి సాగు చేయాలంటూ చేస్తోన్న తప్పుడు ప్రచారంపై టీఆర్ఎస్ చేసిన ఉద్యమంతో బీజేపీ నేతల నోళ్లు మూసుకుపోయాయి. నేరుగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు రంగంలోకి దిగి కేంద్ర సర్కారు బండారాన్ని బట్టబయలు చేయడంతో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ వడ్ల విషయంలో మాటెత్తడం లేదు. కేంద్రం తీరు తేటతెల్లం కావడంతో ఎంపీ అర్వింద్ ముఖం తెల్లబోయింది. నవంబర్ మొదటి వారం వరకు సోషల్ మీడియాలో కనిపించిన ఆయన రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో ముఖం చాటేశారు. ధా న్యం సేకరణపై నేరుగా సమాధానాలు చెప్పలేక… రెండు వారాలుగా టీవీలకు, పేపర్లకు దూరంగా ఉంటూ తప్పించుకుంటున్నాడని సోషల్ మీడియా లో ప్రజల నుంచి విసుర్లు ఎదురవుతున్నాయి.
లోక్సభలో నోరు విప్పేనా…
నిజామాబాద్ జిల్లాలో 2021, యాసంగిలో భారీ గా వరి పంట సాగైంది. ఏకంగా రూ.1400 కోట్ల తో 7లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కొనసాగుతున్న ఈ క్లిష్ట సమయంలోనూ నిజామాబాద్ జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణ జోరుగా నడుస్తున్నది. దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువ చేసే 5లక్షల 35వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటి వరకు సేకరించారు. చివరి గింజ ను సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మర ఆడించిన ధాన్యాన్ని భారత ఆహార సంస్థకు అందించేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధం చేస్తుండగా గత యాసంగి, ప్రస్తుత వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనుకడుగు వేస్తుండడం విడ్డూరంగా మారింది. ఈ పరిస్థితిలో బీజేపీ నుంచి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న అర్వింద్ తన కనీస కర్తవ్యంగా వడ్ల విషయంపై కేంద్రాన్ని నిలదీయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సమావేశాల్లో అంతంత మాత్రంగానే కనిపించే ఎంపీ… కర్షకుల విషయంపై నోరు విప్పాలంటూ గుర్తు చేస్తున్నారు. లేదంటే నిన్నా మొన్నటి వరకు వరి వేయాలంటూ అమాయక ప్రజలను ఉసిగొల్పిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తమ వైఖరిని తేటతెల్లం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ద్వంద్వ నీతి…
రైతు కేంద్రంగా అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా ముందు తెలంగాణే ఉంటుంది. దేశ జనాభాలో నేటికీ 70శాతం మంది వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవారే ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యత గల రంగా న్ని కేంద్ర ప్రభుత్వం కుదేలు చేస్తున్నది. రాష్ట్రంలో ఏడేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబి స్తున్న విధానాలతో బీడు భూములన్నీ పచ్చబడ్డాయి. పంట ఉత్పత్తులు అంతకంతకూ పెరుగుతున్నాయి. జలవనరులు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి పంటలు వేస్తూ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ఘనతను ఓ వైపు మెచ్చుకుంటూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నది. 2021 యాసంగి నుంచి ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్సీఐ పెడుతున్న కిరికిరితో సామాన్య రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా కేంద్రానికి అందిస్తోంది. ఈ తంతు ఏండ్లుగా జరుగుతున్నదే అయినప్పటికీ కోటాను తగ్గించి బియ్యాన్ని సేకరిస్తుండడంతో ధాన్యం సేకరణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం రైతులను ఆదుకోవాలనే ఆశయం తో ధాన్యాన్ని ఆటంకాలు లేకుండా సేకరిస్తున్నారు. రైతు పరిస్థితిని కనీసం ఆలోచించని కేంద్రం మాత్రం పంజాబ్కో నీతి, తెలంగాణకో నీతి అన్నట్లుగా ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోంది.