Pothangal | పోతంగల్, పిబ్రవరి 24 : పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకోలేక నేలవాలింది. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటకు విత్తనాలు, ఎరువులు, కూలీలు వంటి బారి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర గాలులకు పంట నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో ఉన్న రైతులకు ఒక్కసారిగా గాలులు పంటలను దెబ్బతీశాయి. నష్టపోయిన తమకు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి సుప్రియ నేలకొరిగిన పంటలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో వివరాలు తెలుసుకుని ప్రాథమిక అంచనగా సుమారు 20నుండి 25 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు.