రామారెడ్డి (సదాశివనగర్), జూన్10: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులకు భార్య ఫిర్యాదు చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఇందుకుసంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సదాశివనగర్ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సదాశివనగర్ మం డలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45) మే 22న రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి మృతి చెందినట్లు అతడి భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ సంతోష్తో కూడిన దర్యాప్తు బృందం ఘటనా స్థలిని పరిశీలించి, సాక్షుల వాంగ్ములాలు సేకరించింది. సీసీ ఫుటేజీ, పోస్టుమార్టం నివేదికను పరిశీలించి, తలపై బలంగా కొట్టడంతో మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది.
అనుమానితుడిగా ఉన్న గ్రామానికి చెందిన గంగశేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యోదంతం బయటపడింది. రాజయ్య భార్య రేణుక, గంగశేఖర్ మధ్య నాలుగేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. తమకు రాజయ్య అడ్డుగా ఉన్నాడని, అతడు చనిపోతే బీమా డబ్బులు కూడా పొందవచ్చని భార్య.. గంగశేఖర్తో కలిసి హత్యకు కుట్ర పన్నింది. మే 21న రాజయ్యను గాంధారి ప్రాంతానికి గంగశేఖర్ పిలిపించుకొని ఫుల్లుగా మద్యం తాగించాడు.
మత్తులో ఉన్న రాజయ్య తలపై గంగశేఖర్ ఐరన్రాడ్తో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం వద్ద మోటారు సైకిల్ను అక్కడే వదిలి పారిపోయాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులైన కంచర్ల గంగాశేఖర్, కంచర్ల రేణుకను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సదాశివనగర్ సీఐ సంతోష్ కూమార్,ఎస్సై పుష్పరాజ్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా ఆబినందించినట్లు పేర్కొన్నారు.