నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇందూరు నగరం సరికొత్త అందాలు అద్దుకుంటున్నది. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లతో కూడిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి పోతున్నది. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహంతో తొమ్మిదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగానే మిగిలిపోయిన పారిశుద్ధ్య సమస్యకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపింది. ప్రతి డివిజన్లో పార్కులు ఏర్పాటయ్యాయి. రోడ్లు, డ్రైనేజీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆర్యూబీ, నూతన కలెక్టరేట్, విద్యుత్భవన్ నిర్మించింది. కళలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో నగరం నడిబొడ్డున కళాభారతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది.
– ఖలీల్వాడి, ఏప్రిల్ 17
విశాలమైన రోడ్లు, అందమైన మొక్కలు, సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడీ వెలుగులతో నిజామాబాద్ నగరం జిగేల్ మంటున్నది. ఒకప్పుడు గతుకులతో కూడిన ఇరుకైన రోడ్లు, పాడుబడినట్లుగా కనిపించిన ఇందూరు నేడు సుందరంగా మారింది. శిథిలావస్థలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు అన్ని హంగులతో నేడు ఇంద్ర భవనాలను తలపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల నిర్లక్ష్యంతో కనీస మౌలిక వసతులు లేక నగరవాసులు అనేక కష్టాలు చూశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం.. అభివృద్ధే లక్ష్యంగా పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నది. ద్వితీయ శ్రేణి నగరాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్నది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిగాల గణేశ్గుప్తా.. సమస్యల సవాళ్లను భుజాన వేసుకొని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు. అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఐటీ టవర్, ఐటీ హబ్ను ఏర్పాటు చేయించి నిజామాబాద్ ప్రతిష్టను దశదిశలా వ్యాపింపజేశారు.
ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇందూరుకు ఐటీ టవర్తోపాటు ఐటీ హబ్ను కూడా మంజూరు చేశారు. ఐటీ రంగంలో ఉపాధి కోసం హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే కన్నవారికి దగ్గరగా ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలో రూ. 50 కోట్ల నిధులతో ఐటీహబ్ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ భవనాన్ని త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నగరం పచ్చదనంతో సుందరంగా మారింది. ప్రతి వార్డులో పార్కులను ఏర్పాటు చేశారు. వాకింగ్ చేసే నగరవాసుల కోసం ఎక్కడిక్కడ ఓపెన్ జిమ్లను అందుబాటులోకి తెచ్చారు. సారంగపూర్లో అతిపెద్ద అర్బన్ పార్కు నిర్మించారు. శ్మశాన వాటికలను అభివృద్ధిచేశారు.
నగరంలోని ధర్నాచౌక్ వద్ద ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం పక్కన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో రూ. 5 కోట్ల నిధులతో నూతన మున్సిపల్ భవనం పనులు చేపట్టారు. అన్ని హంగులు కల్పించనున్న ఈ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నగర ప్రజలు కుటుంబ సమేతంగా బయటికివెళ్లి సేదతీరాలంటే తిలక్ గార్డెన్ తప్ప మరో స్థలం ఉండేది కాదు. దాన్ని కూడా ఎవరూ పట్టించుకోక నిర్వహణ సరిగా ఉండకపోయేది. ఇప్పుడు నగరంలోని ప్రతి వార్డులో పట్టణ పార్కులు ఏర్పాటయ్యాయి. నగరంలోని రఘునాథ చెరువుపై రూ. 14కోట్లతో మినీ ట్యాంక్బండ్ నిర్మిస్తుండగా పనులు చివరిదశకు చేరుకున్నాయి. అందమైన మొక్కలు, పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ నగరంలో రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నది. అందుకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తున్నారు. కానీ రైల్వే కమాన్వద్ద ఇరుకుగా ఉండడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. వానకాలంలో ప్రతిరోజూ కమాన్వద్ద నిలిచిన నీటితో వాహనదారులు నరకం చూసేవారు. తెలంగాణ సిద్ధించాక నగరవాసుల కష్టాలను దూరం చేసేందుకు అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా రూ.22.80 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జిని మంజూరు చేయించారు. ఆర్యూబీ పనులు పూర్తికావడంతో ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించారు. దశాబ్దాల కల నెరవేరడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని వర్ని చౌరస్తాలో విద్యుత్శాఖ ప్రగతిభవన్ను ఎక్కడాలేని విధంగా 14 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా నిర్మించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటీ 50లక్షలు మంజూరు చేసింది. అన్ని హంగులతో నిర్మించిన విద్యుత్ ప్రగతి భవన్ను ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు చేతులమీదుగా ప్రారంభించారు.
ఆ మూలా ఈ మూలా విసిరేసినట్లుగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు.. అద్దె భవనాలు, పాత గోడలు, అరకొర వసతుల మధ్య విధులు.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అటు ప్రజలు.. ఇటు ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందరి సమస్యలను దూరం చేసి ప్రజలకు పాలనను దగ్గర చేసేందుకు తెలంగాణ సర్కారు కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా కార్యాలయాలన్నీ ఓకేచోట ఉండేలా చర్యలు తీసుకున్నది. నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన 25 ఎకరాల స్థలంలో రూ.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను నిర్మించారు. అన్ని హంగులతో నిర్మించిన నూతన భవనంలో అధునాతన సౌకర్యాలు కల్పించారు.
ఇందూరు.. సాహితీ నిలయం. ఎందరో పేరుగాంచిన కవులు, కళాకారులు ఉన్నారు. కళలను మరింత ప్రోత్సహించేలా ఇందూరు కళాభారతిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా రూ. 50కోట్లు మంజూరు చేశారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందూరు కళాభారతి భవనాన్ని నిర్మించేందుకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
నిజామాబాద్ నగరంలో ఉమ్మడి రాష్ట్రంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించేందుకు పనులు ప్రారంభించినప్పటికీ అనేక అక్రమాలు, నిధుల కొరతతో ముందుకు సాగలేదు. దాదాపు 10 కిలోమీటర్ల మేర చేపట్టిన పనులను అప్పటి కాంగ్రెస్ పాలకులు అర్ధాంతరంగా నిలిపివేశారు. స్వరాష్ట్రంలో అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బిగాల గణేశ్గుప్తా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా.. సీఎం కేసీఆర్తో మాట్లాడి నిధులు తీసుకువచ్చారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఇక ఎన్నటికీ పూర్తికాదనుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని.. రాత్రీపగలు తేడా లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చేయించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసి డ్రైనేజీ కనెక్షన్ల కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఒకప్పుడు ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమైన నిజామాబాద్ నగరం.. ఇప్పుడు జిగేల్ మంటున్నది. నగరాన్ని ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా రూ.300 కోట్ల నిధులతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన రోడ్లను విస్తరించి డివైడర్లు నిర్మించారు. అందమైన మొక్కలు, ఎల్ఈడీ, సెంట్రల్ లైటింగ్తోపాటు ప్రధాన చౌరస్తాల్లో వాటర్ ఫౌంటేన్లు ఆకట్టుకుంటున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి గల్లీ.. సీసీ, బీటీ రోడ్లతో మెరుస్తున్నాయి.