సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ ఆదేశించారు. సైబరాబాద్ కమిషనరేట్లో వర్షాకాల సన్నద్ధత, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్, టీజీఐఐసీ వీసీ, ఎండీ కే శశాంక, ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్ప్రీత్ సింగ్, హైడ్రా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గుంతలు పడిన రహదారులను వెంటనే బాగు చేయాలని కమిషనర్లు సూచించారు. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడం, జంక్షన్లలో కొత్తగా ఫ్రీ లెఫ్ట్ల ఏర్పాటు, పాత వాటి పునర్నిర్మాణం, పనిచేయని ట్రాఫిక్ సిగ్నళ్ల పునరుద్ధరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బాధిత ప్రాంతాల్లో ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి రద్దీ, ప్రమాదాలు ఎకువగా జరిగే జంక్షన్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ అధికారులను ఆదేశించారు.