What Next | పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర్సులు ఎన్ని ఉంటాయి. ఎన్నో ప్రశ్నలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తాయి. తోటి స్నేహితులు, క్లాస్మేట్స్, పక్కింటి వాళ్లు తీసుకున్నారు కదా అని కండ్లు మూసుకొని ఏదో ఒక కోర్సులో జాయిన్ అయినా.. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా జీవితమంతా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కెరీర్ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. టీచర్లు ఉన్నత చదువులు చదువుకున్న పెద్దల నుంచి సరైన సలహాలు, సూచనలు తీసుకొని ముందుకెళ్లాలి. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. పదో తరగతి తర్వాత ఇంటర్, పాలిటెక్నిక్, ప్రత్యేక డిప్లొమా, ఒకేషనల్ విద్య, ఐటీఐ… వంటి కోర్సుల వివరాలు మీ కోసం..
ఎంపీసీ..
ఎంపీసీ పూర్తిగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉంటుంది. దీని తర్వాత ఇంజినీరింగ్, బీఎస్సీ కోర్సులు చదువవచ్చు. ఎంపీసీని ఆల్ రౌండర్ గ్రూపుగా పిలుస్తుంటారు. భవిష్యత్తులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో స్థిరపడాలనుకునే వారు ఈ కోర్సు చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ఆసక్తి ఉన్నవారు చేరితే వారికి భవిష్యత్తు బాగుంటుంది.
బైపీసీ
సైన్స్ రంగంలో స్థిరపడేవారు బైపీసీని ఎన్నుకుంటే బాగుంటుంది. వైద్య వృత్తితో పాటు వృక్ష, జంతు సంబంధిత పరిశోధన రంగాల్లో ఆసక్తి ఉన్న వారు చేరవచ్చు. ఎంబీబీఎస్, హోమియోపతి, ఆయుర్వేద, యోగా, డెంటల్, వెటర్నరీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులపై ఆసక్తి ఉన్న వారు ఈ రంగాన్ని ఎంచుకోవాలి. ప్రధానంగా సైన్స్పై ఆసక్తి ఉన్న వారు ఈ విభాగంలో చేరడం మంచిది.
ఎంఈసీ..
రోజురోజుకూ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఎంఈసీ గ్రూపు వైపు వెళ్తున్నారు. ఇటీవల ఈ కోర్సుకు డిమాండ్ పెరిగింది. మ్యాథ్స్తో పాటు కామర్స్పై ఆసక్తి ఉన్న వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సులో చేరుతుంటారు. ఎంఈసీ చేసిన వారు మ్యాథ్స్లో డిగ్రీ, పీజీ చేయడంతో పాటు బీఏ, ఎంఏ, పీహెచ్డీ కోర్సులు చేసుకునే అవకాశమున్నది. ఎంఈసీతో సీఏ, ఈసీడబ్ల్యూఏ చేసుకునే వెసులుబాటు ఉంది.
ట్రిపుల్ఐటీ..
పదో తరగతి తర్వాత ట్రిపుల్ఐటీలో చేరవచ్చు. ఇది కూడా ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించినది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా బాసర ట్రిపుల్ఐటీలో సీటు పొందే అవకాశముంది. ఇందులో మన అభిరుచికి సంబంధించి వివిధ కోర్సులు చేయవచ్చు.
వ్యవసాయ పాలిటెక్నిక్..
టెన్త్ తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు కూడా చేయవచ్చు. ఇది ఇంటర్మీడియట్తో సమానం. వ్యవసాయ రంగంలో ఆసక్తి ఉన్న వారు వ్యవసాయ పాలిటెక్నిక్ రెండేండ్ల శిక్షణ తీసుకుంటే వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)గా ఉద్యోగం పొందే అవకాశమున్నది. వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకునే అవకాశమున్నది. దీంతో ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేటు రంగాల్లో ఈ కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
పాలిటెక్నికల్ (జనరల్)..
పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాసి రెండు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న వారు నేరుగా బీటెక్ థర్డ్ ఇయర్లో చేరే అవకాశముంది. వృత్తి విద్యా కోర్సుకు సంబంధించిన పాలిటెక్నిక్పై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కూడా ప్రైవేటు సెక్టార్లో ఉపాధి పొందే అవకాశముంది.
వెటర్నరీ డిప్లొమా..
వెటర్నరీ డిప్లొమా కోర్సు చేసుకునే అవకాశముంది. పశు సంపదపై ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులు చేయవచ్చు. డిప్లొమా చేసిన వారికి పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు పొందే అవకాశముంది. బీఎస్సీ వెటర్నరీ చదువుకునే అవకాశమున్నది. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేస్తే మండల పశువైద్యాధికారిగా ఉద్యోగాలు పొందేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలో (డెయిరీ ఫాం) వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.
ఐటీఐ..
పదో తరగతి పాసైన వారు ఐటీఐలో చేరవచ్చు. మంచి మార్కులు వచ్చిన వారు దీనిని ఎంపిక చేసుకునే అవకాశమున్నది. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, మిషనర్ కోర్సులుంటాయి. వృత్తి విద్యకు సంబంధించిన ఈ కోర్సులు చదివిన విద్యార్థులు త్వరతగతిన స్థిరపడే అవకాశమున్నది.
సీఈసీ..
ఇటీవల కామర్స్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బ్యాంక్ క్లర్క్ పోస్టులపై ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులో చేరుతుంటారు.
పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఇది కీలకమైన మలుపు. అమ్మానాన్నల చెంత ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు తమ భవిష్యత్కు పునాది వేసుకునే టర్నింగ్ పాయింట్ ఇది. పది తర్వాత పది రకాల చదువులు చదువుకునే అవకాశం ఉంది. విద్యార్థి అభిరుచి, ఆసక్తిని బట్టి తనకు అనుకూలమైన కోర్సును ఎంపిక చేసుకునే సమయం దగ్గర పడింది. ఇటీవలే పదోతరగతి పరీక్ష ఫలితా లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఏఏ కోర్సు లు ఉంటాయి..? ఏఏ కోర్సులు అనుకూ లం.? వాటిని చదివిన తర్వాత ఉన్నత కోర్సులు, ఉపాధి అవకాశాలు ఏమిటి? అనే ది ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఒకటో మెట్టు ఇంటర్..
పదోతరగతి పూర్తయిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఎన్నుకునేది ఇంటర్మీడియట్. ఇంటర్లో సైన్స్, ఆర్ట్స్ అని రెండు గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ సైన్స్ కోర్సులు. ఎంఈసీ, హెచ్ఈసీ, సీఈసీ ఆర్ట్స్ కోర్సులు ఆర్ట్స్ గ్రూపునకు సంబంధించినవి.
హెచ్ఈసీ..
చాలా తక్కువ మంది ఈ కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ మంది ఈ కోర్సులో చేరుతున్నారు. ఈ కోర్సు చేసిన వారికి అపార అవకాశాలున్నాయి. బీఏ, ఎంఏ, పీహెచ్డీతో పాటు పోటీ పరీక్షలైన సివిల్స్, గ్రూప్స్ రాయడానికి ఈ కోర్సు దోహదపడుతుంది.