నిజామాబాద్ సిటీ : ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశంలో భాగంగా మూడవరోజు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక, పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ప్రభుత్వ వసతిగృహాలు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వసతి గృహలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఆయా శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్లో లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో , జడ్పీటీసీలు అంబర్సింగ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.