ఆర్మూర్, జనవరి 8: సబ్బండవర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మత సామరస్యానికి, సామాజిక వికాసానికి, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి తెలంగాణ ప్రతీకగా నిలుసున్నదని పేర్కొన్నారు. ఆదివారం ఆయన పట్టణంలో కొనసాగుతున్న దేవాంగ కుల సంఘ కల్యాణ మండప నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడారు.
యుద్ధ ప్రాతిపదికన కల్యాణ మండపం నిర్మాణ పనులను పూర్తి చేసి ఏప్రిల్ 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజు తొలి కల్యాణం నిర్వహించి, అతిథులకు తానే స్వయం గా విందు భోజనం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. 750 గజాల స్థలంలో చేపట్టిన దేవాంగ సంఘ కల్యాణ మండపానికి ఇప్పటికే రూ. 40 లక్షలు ఖర్చు చేశామని, మిగితా పనులకు మరో రూ. 30 లక్షలు ఇస్తామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మున్నూరుకాపు, పద్మశాలి, బంజారా, దేవాంగ తదితర సంఘాలకు మొత్తం ఆరు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు.
కేసీఆర్ అద్భుతమైన పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే అన్ని కులాల వారికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవసరమైన నిధులు, స్థలాలను కేటాయించిందని వివరించారు. సుమారు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్లో పదెకరాల స్థలంలో రూ.10కోట్ల వ్యయంతో ఆత్మ గౌరవ భవనం నిర్మిస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ పేద ప్రజల పక్షపాతిగా చరిత్రకు ఎక్కారని, ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తోందన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. కేసీఆర్ మూడోసారి సైతం విజయం సాధించి హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దేవాంగ సంఘ నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులును శాలువాతో సన్మానించారు.