విద్యానగర్,జనవరి 19 : కామారెడ్డి మాస్టర్ ప్లాన్తో రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా ట్లాడారు. 45 రోజులుగా మాస్టర్ ప్లాన్పై రైతులు ఆందోళనలు చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ ప్రభు త్వంపై ఉసిగొల్పుతున్నారని అన్నారు. కౌన్సిల్లో తీర్మానించి పంపిన ప్లాన్కు వ్యతిరేకంగా డీడీఎఫ్ కన్సల్టెన్సీ, డీటీసీపీ అధికారులు మార్చి పంపారని అన్నారు. ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కౌన్సిల్లో ఆమోదించింది కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వమని అన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తాము రెసిడెన్షియల్ జోన్గా పంపిస్తే ఇండస్ట్రియల్ జోన్గా మార్చి పంపారని అన్నారు. గతంలోనే మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో అభ్యంతరాలు చెప్పవచ్చని చెప్పామన్నారు.
పత్రికలు, ఫ్లెక్సీలు, టీవీల్లో ప్రకటనలు సైతం ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 2,396 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని శుక్రవారం అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామన్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ పూర్తి వివరాలు వివరించారని అన్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో అనారోగ్య కారణాలతో స్పందించలేక పోయామని తనను క్షమించాలని కోరారు. రైతులకు సంబంధించిన ఒక గుంట భూమిని కూడా పోనివ్వబోమని అన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయడంతో పాటు మార్పులు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్, హఫీజ్, శంకర్ రావు, క్రిష్ణాజిరావు, ముప్పారపు అపర్ణ, కాసర్ల గోదావరి, ఉరుదొండ వనిత, గడ్డమీది రాణి, ఆకుల రూప, పడిగె సుగుణ తదితరులు పాల్గొన్నారు.