నిజామాబాద్ స్పోర్ట్స్/కామారెడ్డి, డిసెంబర్ 20 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా నిర్వహణపరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన అంశాలతో కూడిన వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలని, మార్పులు, చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో పెట్టకూడదని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని తక్షణమే గుర్తిస్తూ, పోలింగ్ కేంద్రాల పునః వ్యవస్థీకరణ చేయాలని సీఈవో సూచించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పుల విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించాలని, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందించిన తుది జాబితాను తమకు పంపించాలన్నారు.
2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరూ ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను ఖరారు చేయాలని, భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంతసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ, నివేదికలు సమర్పించాలన్నారు. నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామారెడ్డి జితేశ్ వీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.