లక్షలాది కుటుంబాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్లో నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న జలధార వేగంగా ఆవిరవుతున్నది. మండుటెండలు దంచి కొడుతున్న తరుణంలో మున్ముందు తాగునీటిగండం తలెత్తే ప్రమాదం పొంచి ఉన్నది. ఐదారు జిల్లాలకు తాగునీరందించే ప్రాజెక్టు ఎండి పోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడే ఇలా ఉంటే మే, జూన్ మాసాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తున్నది.
నిజామాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కాంగ్రెస్ సర్కారుకు ముందుచూపు లేకపోవడం, వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో విఫలం కావడంతో లక్షలాది ఆవాసాలకు క‘న్నీటి’ కష్టాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించని పాలకులు.. ప్రాజెక్టు నుంచి ఎడాపెడా దిగువకు నీటిని విడుదల చేశారు. ఫలితంగా ఎస్సారెస్పీ ఇప్పుడు డెడ్స్టోరేజీకి చేరువవుతున్నది. శ్రీరాంసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 12 టీఎంసీలకు పడిపోయింది. ప్రభుత్వ ప్రణాళికాలోపం వల్ల ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోగా, ఇప్పుడు తాగునీటికీ తండ్లాడే పరిస్థితి తలెత్తింది.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రధాన జలాశయంలో నీటి నిల్వలు అడుగడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఐదారు జిల్లాల తాగునీటికి ఆధారమైన ఎస్సారెస్పీ నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం మూలంగా ఇప్పుడు తాగునీటి గండం పొంచి ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1059.10 అడుగుల (12.06 టీఎంసీలు) మేర నీరు ఉంది. గతేడాది ఇదే సమయానికి 30 టీఎంసీలు ఉండగా, కాంగ్రెస్ సర్కారు చేష్టల వల్ల ప్రస్తుతం 12 టీఎంసీలు మాత్రమే నీరు మిగిలింది.
ఫలితంగా మండుటెండల్లో తలెత్తే నీటి గండం కళ్లముందు కనిపిస్తున్నది. ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ ద్వారా ఇష్టారీతిన నీళ్లను దిగువకు పంపడం మూలంగా తాగునీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. నెలల వ్యవధిలోనే ఏకంగా 67 టీఎంసీలను కిందకు తరలించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లోనూ వరద కాలువ ద్వారా ఇన్ఫ్లో రావడంతో శ్రీరాంసాగర్ నిండుకుండలా మారింది. ఫలితంగా తాగు, సాగు నీటికి కొరత లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాగు, సాగునీటికి కటకట ఏర్పడిందని ప్రజలు, రైతులు వాపోతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధారంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేస్తున్నారు. రోజుకు 231 క్యూసెక్కుల నీటిని ఇం దుకు వినియోగిస్తున్నారు. కోరుట్ల – జగిత్యాల సెగ్మెంట్కు 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్ – నిర్మల్ సెగ్మెంట్కు 63, ఆర్మూర్ – నిజామాబాద్ – కామారెడ్డికి 107 క్యూసెక్కుల చొప్పున వదలాల్సి ఉంది. ఎండలు దంచి కొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి ఇక్కట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముందుచూపు లేని కాంగ్రెస్ ఇష్టారీతిన 61 టీఎంసీలను దిగువకు పంపించి, ఇప్పుడు చేష్టాలుడిగి చూస్తున్నది.
కేసీఆర్ హయాంలో మండుటెండల్లోనూ నిండుకుండలా కనిపించిన ఎస్సారెస్పీ ప్రస్తుతం కళావిహీనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన పది రోజులకు డిసెంబర్ 17న ఎస్సారెస్పీలో 78.342 టీఎంసీలు (1088.60 అడుగులు) నీరు నిల్వ ఉంది. వేసవిని దృష్టిలో పెట్టుకోకుండా ఎస్సారెస్పీ నీటిని ఎడాపెడా దిగువకు వదలడంతో ప్రాజెక్టు అడుగంటింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత నీటి విడుదలలో పారదర్శకత లోపించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే ఇష్టానుసారంగా నీళ్లను దిగువకు వదిలేశారు. ఆవాసాలకు తాగునీరందించాలన్న బాధ్యతను విస్మరించి. డిసెంబర్ 17 నుంచి ఏప్రిల్ 5 వరకు 67 టీఎంసీలు తరలించారు.
సరైన వ్యూహం లేకపోవడం, ఇష్టానుసారంగా దిగువకు సాగునీరు పేరుతో విచ్చలవిడిగా వదలడంతో నీటి ఎద్దడి తప్పేలా లేదు. శ్రీరాంసాగర్లో నీటి మట్టం తగ్గుతుండటంతో ప్రాజెక్టు లోపలి భాగం బయటికి తేలిపోయి కళావిహీనంగా దర్శనం ఇస్తోంది. సగానికి ఎక్కువ ప్రాంతమంతా మైదానాన్ని తలపిస్తున్నది. బ్యాక్ వాటర్ ఏరియాలో కృష్ణ జింకల సవ్వడి తగ్గిపోతుండగా వేటగాళ్ల ఉచ్చులోనూ భారీగా మూగ జీవాలు బలి అవుతున్నాయి. ఎస్సారెస్పీ డెడ్ స్టోరేజీ 7 టీఎంసీలు కాగా, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలను ఏ విధంగా తీరుస్తారో సర్కారుకే తెలియాలి.