రెంజల్, మార్చి 31 : మండలంలోని కందకుర్తి గ్రామం ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదిరోజులుగా కుళాయి ద్వారా తాగునీరందడంలేదు. రంజాన్ పండుగ పర్వదినాల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం వినియోగించేందుకు నీరు అందక నానా అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే వారే కరువయ్యారని అధికారుల తీరుపై మహిళలు మండిపడుతున్నారు. పంచాయతీ నుంచి పరిమితికి మించి కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతోపాటు తరచూ లీకేజీలు ఏర్పడడం తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో పనులను వదులుకొని వ్యవసాయ బోరుబావుల నుంచి బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పుడే నీటి కొరత ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి ఇబ్బందుల విషయమై గ్రామ కార్యదర్శి సతీశ్ చంద్రను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. నీటి కొరత ఉన్న విషయం వాస్తవమేనని, ప్రతి ఇంటికీ నీరు అందేలా పైపు లైన్కు వాల్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.