ధర్పల్లి మినీ ట్యాంక్బండ్ సుందరంగా ముస్తాబవుతున్నది. పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఆయకట్టుకు ఒకవైపు పచ్చని అందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మొదటి విడుతలో రూ.2.36 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. గార్డెన్ ఏర్పాటుతోపాటు బోటింగ్ పాయింట్ను సైతం ఏర్పాటు చేయనున్నారు.
ధర్పల్లి, నవంబర్ 23: హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పంచేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్ బండ్లను మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు చెరువును ఎంపిక చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల కేంద్రంలో మినీ ట్యాంక్బండ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఆయకట్టుకు ఒకవైపు పచ్చని అందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. పల్లె చెరువుకు పట్నంలోని ట్యాంక్బండ్ను తలపించేలా సెలయేటి అందాలు, అందమైన గార్డెన్లు, బోటింగ్ పాయింట్ సైతం రూపుదిద్దుకోనున్నాయి.
ధర్పల్లి-సీతాయిపేట్ రెండు గ్రామాల మధ్య అందంగా పొదిగి ఉన్న చెరువు కట్టను రూరల్ నియోజకవర్గంలో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దేందుకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సంకల్పించారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మొదటి విడుతలో రూ.2.36 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. రూ.99.70లక్షలతో కట్ట బలోపేతం, బతుకమ్మ ఘాట్ నిర్మాణం, పూడికతీత, తూముల మరమ్మతు తదితర పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. దీంతో పల్లె ప్రాంతం అందమైన ప్రకృతి సోయగాలు.. పక్షుల కిలకిలరావాలు..పచ్చని పంటలతో ఆహ్లాదం పంచుతూ కనువిందు చేయనున్నది.
చెరువుకు మరమ్మతులు చేయడంతో భూగర్భ జలాలకు ఢోకా లేకుండాపోయింది. రెండు, మూడేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో సాగు కు ఇబ్బం ది లేదు. చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చడంతో ఎంతో అందంగా కనిపిస్తున్నది. రెండు గ్రామా ల మధ్య అందంగా పొదిగి ఉన్న చెరువు కట్టను మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దడం హర్షణీయం.
– గడ్డం రాజారెడ్డి, రైతు, ధర్పల్లి
ధర్పల్లి-సీతాయిపేట్ గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చిన ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు మండల ప్రజలు, రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. గతంతో పోలిస్తే చెరువు ఎంతో అందంగా మారింది. సాయంత్రం వేళ చెరువు కట్టపైకి వెళ్లి ప్రశాంతంగా గడుపుతున్నాం. కట్టపై సైడ్ గ్రిల్, ఫుట్పాత్ వే ఏర్పాటు చేయడంతో ప్రజలు సైతం ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్తున్నారు.
-సబావట్ శ్రీనివాస్ నాయక్, సొసైటీ డైరెక్టర్, ధర్పల్లి
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువు మరమ్మతు పనులు పూర్తి చేయడంతో నీటి సామర్థ్యం పెరిగింది. మరమ్మతులతో భూగర్భ జల మట్టం పెరగడంతోపాటు ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఈ సంవత్సరం వర్షాలు సైతం సమృద్ధిగా కురవడంతో రైతులు ఉత్సాహంగా వానకాలం పంటలను సాగు చేశారు. మంచి దిగుబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా రెండు నెలలుగా అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నది.
ధర్పల్లి గ్రామంలోని మురికి నీరంతా వచ్చి చెరువులో కలిసేది. ప్రధాన మురికి కాలువ నీటి పారకం చెరువులోకి ఉండడంతో చెరువులోని మంచి నీరంతా కలుషితంగా మారేది. కానీ, ఇప్పుడు ఆ మురికి కాలువను పోలీస్ స్టేషన్ పక్కన క్వార్టర్స్ నుంచి పెద్ద కాలు వ తీసి అలుగుపై నుంచి ప్రవహించే నీటితో కలిసిపోయేలా చేశారు. దీంతో చెరువు మరింత శుభ్రంగా, స్వచ్ఛమైన నీటి సరస్సును తలపిస్తున్నది.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా కట్ట వెడల్పు, చిన్న తూ ము వైపు మరో బతుకమ్మ ఘాట్, కట్ట పైనుంచి వాహనాలు నడిచేలా ఏర్పాట్లు చేశారు. కట్టపైన ఉన్న గంగమ్మ ఆలయం వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కొన్ని కారణాలతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
మినీ ట్యాంక్ బండ్ పనుల్లో భాగంగా కట్టపై కాంక్రీటు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే కట్టపై కాంక్రీటుకు బదులు అలుగుపై వాక్ వే బ్రిడ్జి(కాలి నడక బ్రిడ్జి) నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరారు. దీంతో అప్పటి నుంచి పనులు పెండింగ్లో ఉండిపోయాయి. అగ్రిమెంట్లో ఉన్న పనులకు బదులు మరో పని చేపట్టాలంటే రాష్ట్రస్థాయి అధికారుల పర్యవేక్షణ, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పనులు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి మిగిలిన పనులను పూర్తి చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.