నందిపేట్, డిసెంబర్ 28 : ఆయకట్టు పరిధిలోని పంటలపై రైతులకు పూర్తి భరోసా వచ్చింది. ఆయకట్టుకు సరిపడా నీటిని విడుదల చేయడంతో పంటలు సునాయాసంగా బయటపడుతాయన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తున్నది. గతంలో నీటి విడుదల కోసం రైతులు.. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వం చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయిన తర్వాత ఆయకట్టుకు నీరొచ్చేది.
ఆయకట్టు రైతుల అవసరాన్ని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సీజన్లో రైతులు అడగకముందే సాగునీటిని విడుదల చేస్తున్నది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి గతంలో కన్నా ముందుగానే ఈ యాసంగి సీజన్లో నీటి విడుదలకు అనుమతులు తీసుకువచ్చారు. వారం రోజుల క్రితం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభించారు. వానకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు నదికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని వదలడంతో గోదావరి జలకళ సంతరించుకున్నది. దీంతో నీటి విడుదలకు ఆటంకం లేకుండా కొనసాగనున్నది.
నందిపేట్ మండలం ఉమ్మెడ పాత గ్రామం వద్ద గోదావరి నది ఒడ్డున ఉన్న ‘గుత్ప’ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని వారం రోజులుగా ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. సీజన్లో 3.15 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలున్నాయి. ముందుగా చెరువులు నింపడానికి అధికారులు ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ చెరువులు నిండడంతో పాటుగా పిల్ల కాలువల ద్వారా ఆయకట్టు పంట పొలాలకు నీరు అందుతున్నది. గుత్ప లిఫ్ట్తో చెరువుల్లోకి నీరు చేరి, భూగర్భ జలమట్టం పెరిగి బోర్లు నిండుగా పోస్తున్నాయి.
3.15 టీఎంసీల నీటి విడుదల
ఈ సీజన్లో 3.15 టీఎంసీల నీరు వదలనున్నామని, దీంతో పథకం పరిధిలోని చివరి ఆయకట్టు వరకూ సరిపడా నీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. నందిపేట్, మాక్లూర్, వేల్పూర్, ఆర్మూర్, బాల్కొండ మండలాల్లోని 38,792 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఆయకట్టు పరిధిలో 109 చెరువులు ఉన్నాయి. గతేడాది విస్తారంగా వర్షాలు కురియడంతో చెరువుల్లో కొంత నీరు చేరింది. దీంతో కొన్ని చెరువులు సగానికి పైగా నిండిపోయాయి. గుత్ప ఎత్తిపోతల పథకంతోపాటు నందిపేట్ మండలంలో 9 మినీ ఎత్తిపోతల పథకాలు నడుస్తున్నాయి. వాటన్నింటినీ కలుపుకొని నందిపేట్ మండలంలో సుమారు 30వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో 70 శాతానికి పైగా వరి సాగవుతున్నది. సోయా, మక్కజొన్న, కూరగాయలు మిగతా విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
ఆయకట్టు అంతటికీ నీటిని అందిస్తాం
ఆయకట్టు పరిధిలోని పంటలకు సరపడా సాగునీరు అందుతున్నది. రైతులు తొందరపడొద్దు. నీటికోసం పోటీ పడకుండా ఆయకట్టు అంతటికీ వంతుల వారీగా అందిస్తాం. అందుకు సంబంధించి ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ప్రణాళికలను అనుసరిస్తూ నీటిని వదులుతున్నాం. రైతులు సంయమనంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలి.
-ప్రవీణ్, ఏఈ, గుత్ప ఎత్తిపోతల పథకం