హరిత తెలంగాణ దిశగా చేపడుతున్న చర్యలు నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో ఏడు విడుతలుగా పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం కార్యక్రమం ఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పల్లెలతోపాటు పట్టణాలు సైతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గతంలో నగరాలకే పరిమితమైన పార్కులు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పుడు పల్లెల్లోనూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎటు చూసినా పచ్చదనం సంతరించుకున్నది.
-బోధన్, ఆగస్టు 8
ఈ వానకాలంలో ప్రారంభమైన ఎనిమిదో విడుత హరితహారం విజయవంతంగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాల్లో మొత్తం 45 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీటిలో 30 లక్షల 15 వేల మొక్కలను నాటే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీవో) తీసుకున్నది. ఏకధాటి వర్షాలతో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని చేరుకునే దిశగా కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. వరద పరిస్థితులు అదుపులోకి రావడంతో వారం రోజులుగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో 19 లక్షల 47 మొక్కలను నాటి 65శాతం లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇందులో 9 లక్షల 11 వేల మొక్కలను ఇంటింటికీ పంపిణీచేసి.. ప్రజలతోనే నాటించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున అందజేశారు. మిగితా 10లక్షల 36వేల మొక్కలను రహదారుల పక్కన, ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాల్లో నాటారు. మరోపక్క నిజామాబాద్ నగర కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నది.
జూన్ రెండోవారంలో ప్రారంభమైన ఎనిమిదో విడుత హరితహారం.. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నది. ఆగస్టు చివరి నాటికి వంద శాతం లక్ష్యాన్ని దాటేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజలనూ భాగస్వామ్యం చేస్తున్నారు. గతేడాది నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న హరితహారంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఐదు మీటర్లకో మొక్క ఉండేలా ఖాళీ స్థలాల్లో నాటుతున్నారు. గ్యాప్ ఫిల్లింగ్లో భాగంగా చిన్న మొక్కలు నాటి చేతులు దులుపుకోకుండా.. గతంలో నాటిన మొక్కలను పరిశీలించి అంతే ఎత్తు పెరిగిన వాటిని తీసుకువచ్చి నాటుతున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మొక్కలను నాటారు.
ఇక మినీ బృహత్ వనాలు..
ఏడో విడుత హరితహారంలో మండలానికో బృహత్ పల్లె ప్రకృతివనం ఏర్పాటుచేయగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఎనిమిదో విడుతలో మినీ బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రతి మండలానికీ 5 నుంచి 6 మినీ బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేయాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు అన్ని మండలాల్లో స్థల పరిశీలన, నీటి వసతి, మొక్కల ఎంపిక తదితర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
250 కి.మీ.మేర అవెన్యూ ప్లాంటేషన్..
ఇప్పటి వరకు చేపట్టిన హరితహారం కార్యక్రమాల్లో జిల్లాలోని రెండు జాతీయ రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ను అధికార యంత్రాంగం విజయవంతంగా పూర్తిచేసింది. ప్రస్తుతం మల్టీ లేయర్ ప్లాంటేషన్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 250 కి.మీ. మేర రహదారుల వెంబడి మూడు లేదా నాలుగు వరుసల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా రోడ్ల పక్కన స్థలాలను గుర్తించారు. సుమారు 25 కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తయిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు..
గతేడాది హరితహారంలో నిర్ణయించిన విధంగా దాదాపు అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటు పూర్తయ్యింది. జిల్లాలోని 29 మండలాలకుగాను 28 బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ పార్కులను అందమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్థల సమస్య కారణంగా రుద్రూర్ మండలంలో పార్కును ఏర్పాటు చేయలేదు.
కోనోకార్పస్ మొక్కల పంపిణీ నిలిపివేత..
పర్యావరణానికి హానిచేసే కోనోకార్పస్ మొక్కల పంపిణీని ఈ ఏడాది నిలిపివేశారు. కేబుల్ వైర్లు, పైప్లైన్లు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించిన కారణంగా నర్సరీల్లోనూ కోనోకార్పస్ మొక్కల పెంపకం చేపట్టలేదు. త్వరగా ఎదగడంతోపాటు అందంగా కనిపించే ఈ మొక్కలను.. ఇప్పటికే రహదారుల పక్కన, డివైడర్ల మధ్య పెద్దఎత్తున నాటారు. ఈ మొక్కల వేర్లు భూమిలోతుల్లోకి చొచ్చుకెళ్లి తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లతోపాటు కేబుళ్లను సైతం ధ్వంసం చేస్తాయని పర్యావరణ నిపుణుల పరిశీలనలో తేలింది. దీంతో కోనోకార్పస్ మొక్కలను ఇకపై నాటొద్దని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి.