ఖలీల్వాడి, నవంబర్ 22 : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమో దు చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో విద్యార్థులకు ఓటరు నమోదుపై మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఓటరు నమోదు, సవరించుకునే విధానంపై వివరించారు.
ఓటరు కార్డుకు స్వచ్ఛందంగా ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని, ఆధార్ వివరాలను భారత ఎన్నికల సంఘం గోప్యంగా ఉంచుతుందని తెలిపారు. జిల్లా సహకార అధికారి, నోడల్ ఆఫీసర్ సింహాచలం మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక ఉద్యమంలా ఓటరు నమోదు చేయించాలని సూచించారు. కళాశాలల్లో ఏర్పాటు చేసుకున్న ఈఎల్సీఎస్(ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్) ద్వారా వారానికోరోజు గంటపాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రిన్సిపాల్ను కోరారు. అనంతరం 18 ఏండ్లు నిండిన విద్యార్థులతో ఓటరు నమోదు చేయించారు. కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ సుదర్శన్, ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.