ఎస్సారెస్పీ వరదకాలువకు నీటిని విడుదల చేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా సోమవారం జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల ఎక్స్రోడ్ వద్ద రైతులు ధర్నా చేశారు. వరదకాలువకు నీళ్లివ్వకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతు ఐక్యవేదిక హెచ్చరించింది. ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఇతర నాయకులను అరెస్టు చేశారు.
కొడిమ్యాల/మల్యాల, జూలై 20: ఎస్పారెస్పీ ఇందిరమ్మ వరదకాలువకు నీటిని విడుదల చేయాలని జగిత్యాల జిల్లా మల్యాల మండల రైతుఐక్య వేదిక నాయకులు సోమవారం జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి మల్యాల ఎక్స్రోడ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోతారం సహకార సంఘ అధ్యక్షుడు అయిల్నేని సాగర్రావు మాట్లాడుతూ.. వరదకాలువ నింపని పక్షంలో జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మల్యాల తహసీల్దార్ గడ్డమీది శ్రీనివాస్కు వినతిప్రతం అందజేశారు. ధర్నాకు మద్దతుగా జగిత్యాల నుంచి మల్యాల ఎక్స్రోడ్ వద్దకు వస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డిని రాజారాం శివారులో మల్యాల ఎస్సై సందీప్, నూకపల్లి శివారులో వీఆర్కే కళాశాల వద్ద పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ జీవన్రెడ్డిని అడ్డుకోగా తాను ధర్నాకు వెళ్లడంలేదని సూచించడంతో వదిలిపెట్టారు. నూకపల్లి వరదకాలువ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ను కొడిమ్యాల ఎస్సై నరేశ్కుమార్ అరెస్ట్ చేశారని జీవన్రెడ్డికి సమాచారం రావడంతో ఆగ్రహించారు. రవిశంకర్ను నూకపల్లి వరదకాలువ వద్దకు తీసుకురావాలని రోడ్డుపై బైఠాయించారు.
రైతాంగానికి తాగు, సాగునీరుకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని సూచించారు. మల్యాల సీఐ రాజ్కుమార్, పెగడపల్లి, మల్యాల ఎస్సైలు కిరణ్కుమార్, సందీప్కుమార్ .. జీవన్రెడ్డిని అరెస్ట్ చేసి జగిత్యాలలోని ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. ‘మల్యాల, కొడిమ్యాల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా వరద కాలువకు నీళ్లు విడుదల చేయకుండా స్థానిక ఎమ్మెల్యే సత్యం, సీఎం రేవంత్రెడ్డి చోద్యం చూస్తున్నారు. నీళ్లివ్వడం చేతకాని రేవంత్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. మల్యాల మండల ఎక్స్రోడ్డు వద్ద రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న రవిశంకర్ను దొంగలమర్రి పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు. రవిశంకర్ కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించగా.. ఎస్సై నరేశ్ అరెస్ట్ చేసి గంగాధరకు తరలించారు. రైతుల ధర్నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అనుమతి తీసుకున్నారని, జీవన్రెడ్డి, రవిశంకర్ రాకపై సమాచారం లేకపోవడంతో వారిని వారి ఇండ్ల వద్ద వదిలిపెట్టినట్టు మల్యాల సీఐ చెప్పారు.
జీవన్రెడ్డి అరెస్ట్ దుర్మార్గం: కొప్పుల
వరద కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న విపక్ష నాయకుల గొంతు నోకేందుకే ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు.

