సిరికొండ/కంఠేశ్వర్, జూన్ 8 : కబ్జా కోరల్లో ఉన్న అటవీ భూములను కాపాడుకునేందుకు ఊరంతా కదిలారు. కలెక్టరేట్కు తరలివెళ్లి ఆందోళన చేపట్టారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ధర్నా విరమించేది లేదంటూ మూడు గంటపాటు బైఠాయించారు. చివరికి స్వయంగా డీఎఫ్వో వచ్చి అడవుల ఆక్రమణను అడ్డుకుంటానని హామీ ఇవ్వడంతో సిరికొండ మండలం రావుట్ల గ్రామస్తులు ధర్నా విరమించారు.
కంచె చేను మేసింది అన్న చందంగా మారింది అటవీశాఖ అధికారుల పనితీరు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, అటవీని రక్షించాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్న మాట. కానీ అవేమీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు జరగడం లేదనేది నిత్య సత్యం. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గతేడాది నుంచి పోడు భూముల పేరుతో కబ్జాదారులు సర్వే నంబర్ 401లో వందల ఎకరాల్లో విలువైన చెట్లను నరికి భూమిని చదును చేస్తున్నారు.
ఈవిషయం తెలిసినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఇటు రెవెన్యూ అటవీశాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరానికి రూ. లక్షల్లో వసూలు చేస్తూ కబ్జాదారులకు అటవీ శాఖ అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. కబ్జాకు గురైన భూమిని కాపాడాలని గ్రామస్తులు ప్రశ్నిస్తే అమాయకులపై అధికారులు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు అటవీ భూములను కాపా డి, కబ్జా చేసిన భూములు స్వాధీనం చేసుకుని వారిపై అటవీ హక్కుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
అటవీ భూములను కబ్జాల నుంచి రక్షించాలంటూ గ్రామస్తులందరూ ఏకమై సోమవారం కలెక్టరేట్కు తరలివెళ్లారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.కలెక్టర్ వచ్చి హామీనిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు 3 గంటల పాటు బైఠాయించంతో హైడ్రామా కొనసాగింది. పోలీసులు, ఏసీపీ ప్రకాశ్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ వేర్వేరుగా వచ్చి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పినా కలెక్టర్ వచ్చేంత వరకు కదిలేది లేదని గ్రామస్తులు అలాగే కూర్చున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత డీఎఫ్వో సిద్ధార్థ వచ్చి అడవుల ఆక్రమణను అడ్డుకుంటానని హామీనివ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. అటవీశాఖ అధికారుల అండదండలతోనే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులదేనని ఇప్పటికైనా కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని గ్రామస్తులు హెచ్చరించారు.
మా గ్రామంలో వం దల ఎకరాల్లో అట వీ భూమి కబ్జాకు గురవుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు. అటవీ అధికారులు కనుసైగల్లో భూమి కబ్జాకు గురవుతున్నది. కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
అధికారులు పట్టించుకొని అటవీభూ మి కబ్జాకు గురి కాకుండా చూడాలని కోరుకుంటు న్నాం. భూమిని కాపాడాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదు. భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– దాసు, రావుట్ల