భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఊరూరా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, వేల్పూర్లోని రైతువేదిక వద్ద మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మంథనిలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, పెద్దకొడప్గల్లో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మొక్కలు నాటారు.
బాన్సువాడ, ఆగస్టు 26: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంక్షించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం 2016లో తెలంగాణ కు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.మొత్తం 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా..దానిని అధిగమించి ఇప్పటి వరకు 270 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. ప్రకృతి దేవుడు ఇచ్చిన వరమని పేర్కొన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయన్నారు. దేశంలో ప్రతి మనిషికి సగటున కేవలం మూడు చెట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే భూ విస్తీర్ణంలో 33 శా తం అడవులు ఉండాలన్నారు. 2014లో అడవుల విస్తీ ర్ణం 26 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కృషి తో ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని అన్నారు. చెట్లు ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో భజంగరావు, తహసీల్దార్ వరప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు పాల్గొన్నారు.
వేల్పూర్, ఆగస్టు 26: సీ ఎం కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడని, అందుకే రాజకీయాలకు సంబంధం లేకుండా హరితహారం చేపట్టి గ్రీనరీ పెంపకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వేముల సురేందర్రెడ్డి రైతువేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరితహారమనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో అడవులు, గ్రీనరి శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు. తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పచ్చదనం పెంపులో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. హరితహారం సమాజహితం కోసం గొప్ప కార్యక్రమమని, ఓట్ల కోసమో సీట్ల కోసమో కానే కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు మనమందించే సంపద పచ్చదనమేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, ఐకేపీ పీడీ చందర్నాయక్, డీఎల్పీవో శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, దీంతో రాష్ట్రంలో 33శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో, మండలంలోని మంథని గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇది కేసీఆర్ విజన్లో భాగమన్నారు. హరితహారంతో రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు.
ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ బృహత్ ప్రకృతి వనంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు పండుగలు, ప్రత్యేక రోజులు వచ్చినప్పుడు తమ ఇంటి పరిసరాలు, పెరడు, పొలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో నేడు తెలంగాణలో గ్రీనరీ పెరిగిందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. వర్షాలతో భూగర్భజలాలు పెరిగి మానవ మనుగడకు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, జిల్లా అటవీశాఖ అధికారి గోపాల్రావు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, కామారెడ్డి ఎఫ్ఆర్వోలు ఓంకార్, వాసుదేశ్, రమేశ్, కామారెడ్డి ఎఫ్ఆర్వో (స్పెషల్ డ్యూటీ) చరణ్తేజ్, ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొన్నారు.
పెద్ద కొడప్గల్, ఆగస్టు 26: ప్రకృతి దేవుడు ఇచ్చిన వరమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందన్నారు. మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి 2016లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చెట్లు ఉంటే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, విండో చైర్మన్ హన్మంత్ రెడ్డి, సర్పంచ్ తిర్మల్రెడ్డి, ఉప సర్పంచ్ విఠల్, ఏపీవో సూర్యకాంత్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.