వారం రోజులుగా పొగమంచుతో పాటు చలి తీవ్రత బాగా పెరిగింది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. చలికాలం వచ్చిందంటే చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. అంతే కాకుండా చాలా అసహనానికి గురి చేస్తుంది. చలికాలం ఒళ్లంతా చిటపటలాడుతున్నట్లు అనిపిస్తుంది. చలి తీవ్రత పెరిగే కొద్ది చర్మం రంగు, రూపు మారిపోతాయి. చలి తాకిడికి చర్మం మృదు స్వభావాన్ని కోల్పోయి చర్మంపై పగుళ్లు ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. పగుళ్ల నుంచి రక్షించుకునేందుకు కోల్డ్క్రీములను వాడుతూ చిన్న పాటి జాగ్రత్తలు పాటిస్తే మన చర్మ సౌందర్యం నిగనిగలాడుతూ ఎలాంటి పగులళ్లకు లోను కాకుండా మృదువుగా ఉంటుంది.
శీతాకాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే కోల్డ్క్రీములతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణంగా ఉంటుంది. చలికాలంలో సాధ్యమైనంత వరకు విటమిన్లు, ప్రొటీన్లు కలిగిన పోషకాహారం తీసుకుటే చర్మం అందాన్ని సంతరించుకుంటుంది. తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస వంటి పండ్లు, ఖర్జూరా ఎక్కువగా తీసుకుకోవాలి. శీతల పానీయాలు, ఫాస్ట్ఫుడ్లను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. మనం తీసుకునే ఆహారంలో కుంకుమ పువ్వు వాడితే చర్మం మంచి నిగారింపు, మృదుత్వాన్నీ సంతరించుకుంటుంది. ఆహారంలో తగినంతగా పసుపు, అల్లం, జిలకర వాడితే తుమ్ములు, జలుబు, దురద వంటి అలర్జీల నుంచి బయటపడవచ్చు. విటమిన్ సీ ఎక్కువగా కలిగి ఉన్న పండ్లు తీసుకోవడంతో శీతాకాలంలో చర్మం పొడి బారిపోకుండా రక్షణ పొందవచ్చు.చిన్న పిల్లలకు వివిధ రకాల పండ్లతో పాటు బాదం, పిస్తా, అంజీర్ పండ్లు లాంటివి ఎక్కువగా ఇవ్వాలి.
చలి బారి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే స్వెట్టర్లు, మఫ్లర్లు తప్పని సరిగా వాడాలి. వాహనాలపై వెళ్లే వారు ముఖానికి హెల్మెట్, చేతులకు గ్లౌజ్లను వేసుకుంటే మంచిది. దీంతో నేరుగా చల్లగాలి ముఖానికి, చేతులకు తగిలే అవకాశం ఉండదు. చిన్న పిల్లలకు ఈ కాలంలో జలుబు చేసి ఇబ్బందులకు గురవుతుంటారు. చిన్న పిల్లలకు స్వెట్టర్లు, ముఖానికి మంకీ క్యాపులు, పాదాలకు మోకాళ్ల వరకు సాక్సులను తప్పని సరిగా వేయడం మంచిది. చలికాలంలో పాలమీది మీగడను చర్మానికి రాసుకొని కాసేపు అలాగే ఉంచుకుని తర్వాత స్నానం చేయాలి. లేదా ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కొబ్బరి నూనె వేసి చర్మం పొడిబారినట్లు కనబడదు. ఉదయం, సాయంత్రం పడుకునే ముందు శరీరానికి మాయిశ్చరైజ్ చేసుకుని మసాజ్ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మాయిశ్చరైజ్ క్రిములకు బదులు వెన్న, వేరుశనగ నూనెతో కూడా మసాజ్ చేసుకొని, పది నిమిషాల తరువాత స్నానం చేయాలి. పెదాలు పొడిబారిపోకుండా ఉండేందుకు వెన్న, తేనె రాసుకుంటే మృదువుగా ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ కోల్డ్క్రీమలుతో మర్దన చేసుకోవాలి. స్నానానికి గ్లిజరిన్ కలిగిన సబ్బులను వాడాలి. మరీ చన్నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. శీతాకాలంలో శరీరాన్ని కాపాడుకునేందుకు సన్స్క్రీన్ లోషన్ గుణాలు కలిగిన కోల్డ్క్రీములను వాడడం ఉత్తమం. రసాయనాలు కలిగిన సౌందర్య సాధనాలను వాడితే చర్మం సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన సహజసిద్ధమైన క్రీములను వాడడం శ్రేయస్కారం.
ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో వినియోగదారులకు అవసరమైన చాలా రకాల కోల్ట్క్రీములు సూపర్ మార్కెట్లు, కిరాణా, మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. పేరెన్నిక గల అనేక రకాల కోల్డ్క్రీములు మార్కెట్లో లభిస్తున్నాయి.