ఖలీల్వాడీ, మే 20: ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లాలనే సంకల్పంతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టించేందుకు ఐటీ కంపెనీలతో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై మహేశ్ బిగాల సహకారంతో సుమారు 100 కంపెనీల సీఈవోలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. దీంతో నిజామాబాద్ ఐటీ హబ్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు 8 ఐటీ కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ మేరకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులను వివరించారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లలో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామన్న కేటీఆర్.. త్వరలోనే సిద్ధిపేట, నిజామాబాద్, నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. దీంతో పాటు ఆదిలాబాద్లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు.
8 కంపెనీలతో ఎంవోయూ..
మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశం అనంతరం నిజామాబాద్ ఐటీ హబ్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు 8 ఐటీ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా మన దగ్గర కూడా ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయని, పరోక్షంగా ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఐటీ సర్వ్ ప్రతినిధులు లక్ష్ చేవూరి, విజయ్ రంగినేని సహకారంతో నిర్వహించిన సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెకటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఈ.విష్ణువర్ధన్రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు.