ఖలీల్వాడి, నవంబర్ 2 : నగరంలో అభివృద్ధి, సంక్షేమం మరింత కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 50, 51, 28 డివిజన్ల (శివాజీనగర్, గురుద్వారా, గాజుల్పేట్, బ్రహ్మపురి కాలనీ)లో గురువారం విస్తృత ప్రచారం చేశారు. ఆయా డివిజన్లలో మహిళలు బిగాలకు పూలు చల్లి, మంగళహారతులతో స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ తిరుగుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధిని బిగాల వివరించారు. నగరంలో ఐటీ టవర్ నిర్మించి యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, ట్రాఫిక్, వర్షపు నీటితో ఇబ్బందులు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ ట్యాంక్బండ్ను నిర్మించడంతోపాటు ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
రూ.400లకే వంటగ్యాస్, సౌభాగ్యలక్ష్మి, అన్నపూర్ణ పథకం, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, సిర్ప రాజు, 50వ డివిజన్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధా సదానంద్, నాయకులు సంజయ్, 51వ డివిజన్ నాయకుడు రామడుగు బాలకిషన్, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు పద్మ, శంభుని గుడి మాజీ చైర్మన్ మల్కాయి మహేందర్, రింకీ కౌర్, దిల్రాజ్సింగ్, నరేందర్, మాజీ కార్పొరేటర్ రంగు అపర్ణ, రంగు సీతారాం తదితరులు పాల్గొన్నారు.