పదేండ్ల క్రితం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేవారు కాదు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో క్రమంగా ప్రతి మారుమూల పల్లెకూ బీటీ రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చారు. ఇందులో భాగంగా 2022లో రెంజల్ మండలంలోని కళ్యాపూర్- బాగేపల్లి రోడ్డును గత ప్రభుత్వం రూ. 92.50 లక్షల నిధులతో నిర్మించింది. నేడు రోడ్డు సౌకర్యం ఉన్నా ఆర్టీసీ ఆధికారులు బస్సు సౌకర్యం కల్పించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం పల్లెవాసుల దరిచేరడం లేదు.
-రెంజల్, డిసెంబర్ 27
రెంజల్ మండలం బాగేపల్లి, కందకుర్తి రూట్లలో ఆర్టీసీ సేవలు అందడం లేదు. బాగేపల్లి, కునేపల్లి, కళ్యాపూర్, కిసాన్తండా తదితర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఆయా పల్లెవాసులతోపాటు నిత్యం చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు కూడా ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో ఈ రూట్లో నిజామాబాద్-2 డిపో బస్సులు నడిపేవారు. కానీ కరోనా కారణంగా మూడేండ్ల కింద నిలిపివేసిన సేవలను నేటికీ పునరుద్ధరించలేదు. నిజామాబాద్ నుంచి దూపల్లి మీదుగా కందకుర్తికి కేవలం ఉదయం, సాయంత్రం మాత్రమే బస్సు అందుబాటులో ఉంటున్నది. పాఠశాలలకు సెలవులు ఉన్న రోజుల్లో ఒక్క బస్సు కూడా నడపడం లేదు. ఆయా రూట్లలో విద్యార్థులతోపాటు ప్రయాణికులు నిత్యం వేల సంఖ్యలో వివిధ పనుల కోసం బోధన్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
బాగేపల్లి, కళ్యాపూర్, కునేపల్లి, కిసాన్ తండా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద మహిళలు, విద్యార్థినులకు ఆర్థిక భారం తప్పడంలేదు. కూలి పనులకు కోసం పట్టణాలకు వెళ్లే మహిళలు, చదువుకునేందుకు కళాశాలలు, పాఠశాలలకు వెళ్తున్న బాలికలు ఆటోలో ప్రయాణం కోసం ప్రతినెలా కనీసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తుండగా, రెంజల్ మండలవాసులు నేటికీ డబ్బులు చెల్లించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మా గ్రామాలేమైనా మహారాష్ట్ర పరిధిలో ఉన్నాయా అంటూ మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సులను ఎందుకు నడిపించడంలేదని ప్రశ్నిస్తున్నారు.
నందిపేట్, డిసెంబర్ 27: నిజామాబాద్ నుంచి నందిపేట్ వస్తున్న నిజామాబాద్-1వ డిపో బస్సు డ్రైవర్ నాగూరి తుకారాంపై దాడి చేయడంతోపాటు బస్సు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని ఆర్టీసీ అధికారులు, బాధిత డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ బస్టాండ్లో స్టేజీపై ఉన్న సమయంలో నందిపేట్కు చెందిన ఓ మహిళ సీటు కోసం బయటి నుంచి బ్యాగ్ను బస్సులోకి విసరగా కిటికీ అద్దం ధ్వంసమైంది. దీనికి నష్టపరిహారం చెల్లించాలని బస్సు డ్రైవర్ ఆమెను అడిగాడు. నందిపేట్ వెళ్లిన తర్వాత అక్కడ డబ్బులు ఇస్తానని చెప్పిన ఆ మహిళ, తన కుటుంబీకులకు ఫోన్ చేయగా సుమారు 15మంది బస్సు నందిపేట్ బస్టాండ్కు చేరుకున్నారు. డ్రైవర్ కాలర్ పట్టుకొని దాడి చేశారు. రాళ్లతో మళ్లీ బస్సుపై దాడి చేయగా మరో రెండు అద్దాలు పగిలిపోయాయి. మొత్తం మూడు అద్దాలు పగిలిపోయాయని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాగేపల్లి, కునేపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఎందుకు నడపడంలేదు. మా పల్లెలను ఆర్టీసీ అధికారులు మహారాష్ట్రలో కలిపిండ్రా? అందరు బస్సుల్లో ఫ్రీగా పోతున్న రు. మేమేమో బస్సుల్లేక ఆటోలకు పైసలిచ్చి పోవాల్నా? మేము ఓటెయ్యలేదా.. మహాలక్ష్మీ పథకం మాకు వర్తించదా?
-పెరమండ్ల చంద్ర, కునేపల్లి గ్రామం
నేను రెంజల్ ఆదర్శ పాఠశాలలో చదువుతున్నా. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. ప్రతిరోజూ ఆటోలో వెళ్లాల్సిందే. ప్రతినెలా రూ. వెయ్యిదాకా ఆటోకు చెల్లిస్తాం. ఈ ఖర్చు తల్లిదండ్రులకు భారమే.
-ఎస్. అశ్రిత, 9వతరగతి, ఆదర్శ పాఠశాల విద్యార్థిని, బాగేపల్లి.
రోడ్లు బాగున్నా.. బస్సు సౌకర్యం లేక 4కిలోమీటర్లు కాలినడకనే మాకు దిక్కు. బాగేపల్లి నుంచి కళ్యాపూర్ రోడ్డు వరకు నడిచి వెళ్లి అక్కడి నుంచి రెట్టింపు చార్జీలు చెల్లించి నవీపేట్, సాటాపూర్ వైపు ఆటోల్లో ప్రయాణిస్తున్నం.
– సిరిగిరి అనిత, బీడీ కార్మికురాలు, బాగేపల్లి
మా ఊరికి బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నాం. అన్ని ఊర్లల్ల ఆడోళ్లు ఫ్రీల బస్సు ఎక్కుతుండ్రు. మాకేమో బస్సే రాదాయే. చానా ఇబ్బంది అవుతుంది. పొద్దున, సాయంత్రం బాగేపల్లి వరకు బస్సు వేస్తే ఆడోళ్లు, ఉద్యోగులు, విద్యార్థులకు మంచి సౌలత్ అయితది.
– పిట్ల పుష్ప, వ్యవసాయ కూలి, బాగేపల్లి