నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 9 : శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించుకున్నారు. పచ్చడి, పిండి వంటలు తయారు చేసుకొని ఆరగించారు. వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ పఠనం కొనసాగింది. భక్తులు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పల్లెల్లో జడకొప్పు కోలాటాలు ఆకట్టుకున్నాయి.
పండుగ సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. పలుచోట్ల కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. భీమ్గల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, నగర శివారులోని గూపన్పల్లి హనుమాన్ ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు.