నిజామాబాద్ క్రైం, జనవరి 20 : నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు నిందితులను గురువారం త్రీ టౌన్ ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన గంజాయి నాగరాజు, బొత్కూర్ సాయికుమార్ ఇద్దరు పాత నేరస్తులు. గురువారం నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ చౌక్ వద్ద ఎస్సై తన సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై వచ్చిన ఈ ఇద్దరు పోలీసులను చూసి అనుమానాస్పదంగా వెళ్తుండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి నిజామాబాద్ త్రీ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు బోధన్ పట్టణం నుంచి దొంగిలించిన మూడు బైక్లను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు.
నేరస్తులను పట్టుకునేందుకు కృషి చేసిన త్రీ టౌన్ ఎస్సై శ్రావణ్ కుమార్తో పాటు ఏఎస్సై రామకృష్ణ, కానిస్టేబుళ్లు ఎండీ అఫ్సర్, వి.చామింద్, జి.గంగాకుమార్, జె.బాబులను ఈ సందర్భంగా ఏసీపీ అభినందించారు. వీరికి సీపీ చేతుల మీదుగా రివార్డులు సైతం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పాత నేరస్తులైన ఇద్దరిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.