డిచ్పల్లి, ఏప్రిల్ 29 : హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రొఫెసర్ యాదగిరి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోవడం చట్టరీత్యా నేరమని, యాదగిరి రిజిస్ట్రార్గా వెంటనే తప్పుకోవాలని.. లేదంటే అతడిపై కేసు నమోదు చేయిస్తానని టీయూ వీసీ రవీందర్ గుప్తా అన్నారు. యాదగిరికి రిజిస్ట్రార్గా ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదని, ప్రస్తుతం విద్యావర్ధిని ఇన్చార్జి రిజిస్ట్రార్ అని.. వారం రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకరిని టీయూ రిజిస్ట్రార్గా నియమిస్తామని తెలిపారు. టీయూలోని పరిపాలనా భవనంలో మాజీ రిజ్రిస్టార్ విద్యావర్ధినితో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్పై టీయూ వీసీ తీవ్ర ఆరోపణలు&రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్పై టీయూ వీసీ తీవ్ర ఆరోపణలు చేశారు. నవీన్మిట్టల్ చెప్పిన వారిని రిజిస్ట్రార్గా చేయలేదనే కోపంతో కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఇష్టం వచ్చినప్పుడే ఈసీ మీటింగ్ పెట్టాలని చెప్పడం సమంజసం కాదని అన్నారు. రెండు సంవత్సరాలుగా రూసా నిధులు రూ.20 కోట్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో క్యాంపస్లో సైన్స్ కాలేజీ నిర్మిస్తున్న కాంట్రాక్టర్కు బిల్లులు రాక ఆయన ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని చెప్పారు. నవీన్మిట్టల్పై ఇప్పటికే సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశామని, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
పాలకవర్గానికి నేనే బాస్..
టీయూలో ఈనెల 19న హైదరాబాద్ రూసా భవనంలో నిర్వహించిన ఈసీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు పూర్తిగా రద్దు చేసిందని తెలిపారు. పాలకవర్గానికి నేనే బాస్ అని, వాళ్లంతా సభ్యులు మాత్రమేనని అన్నారు. వారు తీసుకున్న ఏ నిర్ణయమైనా చెల్లదని చెప్పారు. వీసీ హోదాలో తాను సమావేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ తన స్థానంలో చైర్మన్గా వ్యవహరించడం సరికాదన్నారు.
టీయూ ఈసీ పాలకమండలి సమావేశానికి హాజరైన ఇంచార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధినిని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటి కరుణ ఎదుటే కమిషనర్ నవీన్ మిట్టల్ గెట్ అవుట్ అంటూ అవమానించారని తెలిపారు. దీంతో తాను సమావేశం నుంచి వాకౌట్ చేశానని, తాను లేకుండా పాలకమండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలను చైర్మన్ హోదాలో వీసీగా తాను లేదా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుందన్నారు. లేదంటే ఆ నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈసీ నిర్ణయాలను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.
తనను రీకాల్ చేయాలంటే అసెంబ్లీలో 2/3 మెజార్టీతో తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. తనపై ఏసీబీ, విజిలెన్స్ వారికి విచారణ జరిపే అధికారం లేదని వీసీ స్పష్టంచేశారు. ఈసీ సభ్యుల కమిటీ తనపై విచారణ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం తనకంటే పై హోదాలో ఉన్నవారితో విచారణ జరిపించాల్సి ఉంటుందన్నారు. వీసీగా తనకున్న అధికారాలతో రూ.5 లక్షలలోపు కొనుగోళ్లు, చెల్లింపులు చేసే అధికారం ఉందన్నారు. నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశామన్నారు. ఇటీవల ఈసీ ఆదేశాల మేరకు తొలగించిన 147 మంది డెయిలీ వైజ్ సిబ్బందిని త్వరలోనే విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని వీసీ తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు టీయూని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన..
వీసీ రవీందర్ విలేకరులతో మాట్లాడుతుండగా.. కొందరు విద్యార్థి సంఘాల నాయకులు హాలులోకి చొచ్చుకొని టేబుళ్లపై ఎక్కి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే వారిని బయటికి లాక్కెళ్లారు. కొందరు అధ్యాపకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని వీసీ ఆరోపించారు.
ఈనెల 26న జరిగిన ఈసీ సమావేశంలో ప్రొఫెసర్ విద్యావర్ధినిని సస్పెండ్ చేస్తూ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ విషయమై విద్యావర్ధినిని ప్రశ్నించగా.. తనకు ఇంతవరకు ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని తాను యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.
పాలకమండలి అనుమతితోనే యాదగిరిని నియమించాం…
– పాలకమండలి సభ్యుడు గంగాధర్గౌడ్
టీయూ రిజిస్ట్రార్గా యాదగిరిని పాలకమండలి అనుమతితోనే నియమించినట్లు పాలక మండలి సభ్యుడు గంగాధర్గౌడ్ తెలిపారు. టీయూలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. టీయూలో జరిగిన పాలకమండలి సమావేశంలో యాదగిరిని రిజిస్ట్రార్గా నియమిస్తే.. వీసీ మూడు నెలలకే చెక్కులపై సంతకాలు చేయాలని రిజిస్ట్రార్పై ఒత్తిడి తేవడంతో ఆయన పక్కకు తప్పుకున్నాడని తెలిపారు. అనంతరం శివశంకర్కు రిజిస్ట్రార్గా నియమించారన్నారు. పాలకమండలి సభ్యులకు తెలియకుండానే విద్యావర్ధినిని రిజిస్ట్రార్గా వీసీ నియమించారని వివరించారు. ఈసీ మీటింగ్ పెట్టమని 17 నెలలుగా మధ్య మధ్యలో వీసీని కలిసి విన్నవించినా మీటింగ్ పెట్టలేదని, తాను ఇష్టం వచ్చినప్పుడు పెడతానని మాట్లాడేవారని చెప్పారు. టీయూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన రవీందర్ గుప్తాకు వీసీగా కొనసాగే అర్హత లేదన్నారు. ఈనెల 19న హైదరాబాద్ రూసా భవనంలో జరిగిన టీయూ పాలక మండలి సమావేశంలో యాదగిరికి రిజిస్ట్రార్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. పాలక మండలి సభ్యులపై వీసీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, త్వరలోనే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే రిజిస్ట్రార్గా విధులు
పాలకమండలి ఆహ్వానం మేరకే ఈనెల 19న జరిగిన ఈసీ సమావేశానికి హాజరయ్యాను. ఈసీ తీర్మానం మేరకు రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. హైకోర్టు ఉత్తర్వులు అధికారికంగా నాకు అందలేదు. కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాను. 30 అక్టోబర్ 2021న ఈసీ నన్ను ఏడాది కాలానికి రిజిస్ట్రార్గా నియమించింది. ఇప్పటి వరకు నేను రిజైన్ చేయలేదు. వీసీ ఒత్తిడిపై శివశంకర్కు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. వీసీ ఉద్దేశపూర్వకంగా ఈసీ సమావేశం నిర్వహించలేదు. 2021 నవంబర్ తర్వాత వీసీ నియమించిన ఇద్దరు ఇన్చార్జి రిజిస్ట్రార్లకు ఈసీ ఆమోదం లేదు. వారిని ఇల్లీగల్గా గుర్తిస్తున్నట్లు ఈసీ తీర్మానించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
–రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి