నందిపేట్, మార్చి 10 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రథసారథి అని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వందలాది మంది బీజేపీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పా టు చేసిన ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘాల నాయకులు మందుల పోశెట్టి, సాంబడి పోశెట్టి, మందు ల ఎంజేఆర్ అశోక్, జంగిడి భాస్కర్, శిలా శ్రీకాంత్, తిట్ల భూమన్న, జక్కం గంగాధర్, పోస్టాఫీస్ భూమన్న, కట్కం సురేశ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసానిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని డ్రామాలాడినా కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిటేనని అన్నారు. మనరాష్ట్రంలో ఉన్నన్ని అద్భుత పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ గడ్డ అభివృద్ధికి అడ్డాగా మారిందన్నారు. ఆర్మూర్లో ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్కు రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జీవన్రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సీనియర్ నాయకులు సుంకరి రవి, ఎస్ఆర్.రమేశ్, ఆనంద్, సంతోష్, భోజన్న పాల్గొన్నారు.