కోటగిరి, డిసెంబర్ 6: పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. ఇందుకోసం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సంబంధించిన ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయిస్తున్నది. పౌష్టికాహారం లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. చిన్నారుల హెల్త్ ప్రొఫైల్ కోసం అంగన్వాడీ కేంద్రాలకు పర్యవేక్షణ కార్డులను అందజేసింది. వాటిలో ఎప్పటికప్పుడు పిల్లల వివరాలను పొందుపర్చి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.
అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గతంలో వారి తల్లిదండ్రులకు తెలిసేది కాదు. ప్రస్తుతం హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందించడం ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అందుతున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు, పాలు, బాలామృతం, స్నాక్స్తోపాటు పూర్వప్రాథమిక విద్యను అందిస్తున్నారు. పౌష్టికాహారంతో చాలా మంది పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతున్నారు. అయినా కొందరిలో పౌష్టికాహార లోపం కనిపిస్తున్నది. హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారాన్ని అందించనున్నారు.
కోటగిరి మండలంలోని 58 అంగన్వాడీ కేంద్రాల్లో 1750 మంది చిన్నారులు ఉన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అదనంగా కోడిగుడ్లు, బాలామృతం, విటమిన్స్ ఉన్న ఆహారం అందజేస్తున్నాం. పిల్లల ఎదుగుదలను తెలుసుకునేందుకు ప్రతినెలా వివరాలను సేకరించి హెల్త్ప్రొఫైల్ కార్డుల్లో నమోదు చేస్తాం. తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదలపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు.
-వినోద, సీడీపీవో, బోధన్
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారుల ఎత్తు, బరువు, భుజాల చుట్టు కొలతలను ఆరోగ్య సమాచారం కార్డులో నమోదు చేసి తల్లిదండ్రులకు అందజేస్తున్నాం. ప్రతినెలా 1 నుంచి 5వ తేదీలోపు చిన్నారుల వివరాలను సేకరిస్తాం. పిల్లల ఆరోగ్యంపై కోసం తీసుకోవాల్సిన జాగ్రతలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం.
– వరలక్ష్మీ, అంగన్వాడీ టీచర్, ఎత్తొండ, కోటగిరి