నిజామాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. సొంత రాష్ట్ర కల సాకారం కోసం కొందరు ఉరివేసుకున్నారు. తెలంగాణ ఎక్కడ రాదేమోనని బెంగతో మరికొందరు ఒంటికి నిప్పంటించుకున్నారు. ఇంకొందరైతే క్రిమిసంహారక మందును తాగి ఆత్మార్పణం చేశారు. అమరుల త్యాగ ఫలితం… ఉద్యమ నేత కేసీఆర్ పోరాటంతో స్వరాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ పాలన మొదలైంది. ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. రూ.10లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి భరోసానిచ్చారు. ఇంటిపెద్దను కోల్పోయిన వారికి పెద్దదిక్కయ్యారు. తండ్రిలా.. అన్నలా..కొడుకులా మారి అమర వీరుల కుటుంబాలకు ఏలోటూ రాకుండా చూస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారు.
ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టమిది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల యాదిలో జరిగిన అభివృద్ధి వెలుగులు నేడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఘనకీర్తి కలిగిన తెలంగాణ మట్టి బిడ్డల మనోవేదనకు ముగింపు పడి, త్యాగాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకొని స్వరాష్ట్రంలో తలెత్తుకుని సగర్వంగా నిలబడి దశాబ్ద ఉత్సవాలు జరుపుకొంటున్నది. దేశ రాజకీయాల్లో విలక్షమైన నేత, సీఎం కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచింది మన తెలంగాణ. ఓ వైపు అభివృద్ధి ఫలాలను సామాన్య ప్రజలకు అందజేస్తూనే… మరోవైపు తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ ఒక్కరే. వందలాది మంది అమరుల త్యాగాల స్ఫూర్తిని ఎత్తిపట్టి దేశ ప్రజలకు తెలంగాణ జాతి ఘనకీర్తిని చాటి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా జరిగిన పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఎంతో మంది అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. వారి కుటుంబాలను ఆదరించి కొండంత అండగా నిలిచింది. వారి త్యాగాల స్ఫూర్తితోనే దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ నిలబెడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 49 మంది అమరవీరులు..
సమైక్య పాలకుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు జరిగిన అనితర పోరాటంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఎంతో మంది ప్రాణాలకు తెగించి కొట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో మొత్తం 49 మంది అమరవీరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 32 మంది ప్రాణత్యాగం చేయగా కామారెడ్డి జిల్లాలో 17 మంది ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. తెలంగాణ వస్తే చీకట్లు, చింతలు తప్ప వెలుగులు ఉండవని సమైక్య పాలకులు రాష్ట్ర ఏర్పాటు దశలోనే భయపెట్టారు. ఇప్పుడు కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో వారంతా నోళ్లు వెళ్లబెట్టేలా ప్రణాళికాబద్ధమైన ఆచరణలతో సమయానుకూలమైన నిర్ణయాలతో 24గంటలు మేలైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. అటు రైతు జీవితంలో ఇటు తెలంగాణ అంతటా ఈంచు భూమి కూడా ఖాళీ లేకుండా పంటలు పండే స్థాయికి చేరుకున్నది. హరిత విప్లవాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తూ పచ్చని చెట్లతో నేల తల్లికి హరితహారం వేస్తున్నది.
కేసీఆర్ నాకు పెద్దకొడుకు..
ఖలీల్వాడి జూన్ 17: ‘నా పెద్ద కొడుకు తెలంగాణ కోసం ఉరేసుకొని సచ్చిపోయిండు.. తెలంగాణ వస్తే బాగుండు.. ఇగ మన బాధలు పోతాయి.. మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటది.. రావాలె తెలంగాణ.. ఎప్పుడొస్తది.. ఇంకెన్నాళ్లు.. ఇగో గిదే మనాది మా రాజుగాంది.. ఆడు సచ్చిపోయి ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయిండని బాధపడని రోజు లేదు. తెలంగాణ వచ్చింది. మా ఇంటికి కేసీఆర్ సారు పెద్దకొడుకుగా నిలబడ్డడు. పదిలక్షల రూపాల సాయం జేసిండు.. నా కోడలికి సర్కారుకొలువు ఇప్పించ్చిండు… అప్పులు చేయకుండా మనవరాలి పెండ్లి చేసినం.. మిగిలిన ఇద్దరి పిల్లల పేర్ల మీద ఇంత జాగకొన్నం.. ఇపుడుమేమంతా సంతోషంగా ఉన్నం. నా మనవరాలికి కొడుకు పుట్టిండు.. నా పెద్ద కొడుకు రాజు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కండ్లు తెర్చిండు…’ అని గాజుల అంబవ్వ ఆనాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నది. ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేసింది.
నగరంలోని కోటగల్లీ ప్రాంతానికి చెందిన రాజేందర్ కూలీనాలి చేసుకొని కుటుంబాన్ని వెళ్లదీస్తుండేవాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతన్న తరుణంలో నిత్యం ఇంటికి రాగానే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వస్తుందో, మన బాధలు ఎప్పుడు తీరుతాయో అని మదనపడుతూ ఉండేవాడు. 2010 ఆగస్టు 4న తానుంటున్న కిరాయి ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. అమరుడు రాజేందర్కు ముగ్గురు కూతుళ్లు. ఇక ఆ కుటుంబం గోస అంతాఇంతా కాదు. ఇక ఆ కుటుంబానికి దిక్కెవరని కడుదీనంగా రోజులు గడుపుతున్న సమయంలోనే .. అమరుల ప్రాణత్యాగాల సాక్షిగా.. ఉద్యమ దళపతి కేసీఆర్ ప్రాణాలకొడ్డి చేసిన పోరాటంతో స్వరాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ బిడ్డలకు ఎవరికీ అన్యాయం జరగనీయకుండా కేసీఆర్ ఆనాడు చేసిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కొడుకులను కోల్పోయి కడుపుకోతతో అల్లాడుతున్న తల్లులకు, భర్త లేక ఆ కుటుంబానికి ఆసరా కరువై కడుదయనీయంగా మారిన ఆ కుటుంబాల్లో కేసీఆర్ పెద్ద కొడుకుగా అవతరించారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ఊతమిచ్చారు. రాజేందర్ భార్య లావణ్యకు మాక్లూర్ బీసీ హాస్టల్లో కుక్గా ఉద్యోగం లభించింది. నెలకు రూ. 18వేల వేతనం వస్తున్నది. సర్కార్ ఇచ్చిన రూ. 10 లక్షలతో పెద్ద బిడ్డ వరలక్ష్మికి పెండ్లి చేశారు.
ఏ రందీ లేదు..
ఆయన సచ్చిపోయినంక మాకు పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. పెద్ద బిడ్డ పెండ్లి జేసినం. ఇద్దరు బిడ్డల పేర్ల మీద జాగా కొన్నం. నాకు బీసీ హాస్టళ్ల వంటమనిషిగా గవర్నమెంటు కొలువు ఇచ్చింది. నెలకు పద్దెనిమిది వేలు ఇస్తుండ్రు. మేం మంచిగా బతుకుతున్నం. అంతా కేసీఆర్ సార్ చలువే.
– లావణ్య, రాజేందర్ భార్య
మా కుటుంబాన్ని కేసీఆర్ ఆదుకున్నారు..
వేల్పూర్, జూన్ 21 : ‘రజిత ఏడున్నావ్ బిడ్డా…అప్పుడే పదమూడేండ్లు గడిచిపోయినయ్..తెలంగాణ తప్పక వస్తుంది..మన బతుకులు మారిపోతాయ ని చెప్పి మా కుటుంబానికి కడుపుకోత మిగిల్చావు. కూతురు యాదిలో బతుకుతున్నాం. కూతురు దూరమైన బాధతో ఉన్న మమ్మల్ని ప్రభుత్వమే ఓదార్చింది.’ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్-రాధలకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురైన తెడ్డు రజిత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి పోసింది. మలిదశ పోరాటంలో రజిత తరచుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి స్నేహితులతో చర్చించేది. తెలంగాణకు ఆంధ్రా నాయకులు అడ్డుపడుతుండడంతో తీవ్రంగా కలత చెందింది. వేల్పూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తెడ్డు రజిత 2010 జనవరి 9న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కూలి పనిచేసుకొని ఇద్దరు కూతుళ్లను పెద్ద చదువులు చదివిద్దామని అనుకున్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఇంటికి పెద్ద కూతురు దూరం కావడం, ఉండడానికి ఇల్లు లేక రజిత కుటుంబ సభ్యులు కష్టాలు పడ్డారు. ‘కూతురుపోయిన పుట్టెడు దుఃఖంలో కేసీఆర్ సారు కొండంత సాయం అందించిండ్రు. ‘మాకు రూ.10లక్షలు ఆర్థిక సహాయం జేసిండు. నాకు బీసీ హాస్టల్లో నౌకరీ ఇచ్చిండ్రు. మా కుటుంబానికి అన్ని రకాలుగా అండగా కేసీఆర్ నిలిచిండు’అంటూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన తెడ్డు రజిత తల్లి తెడ్డు రాధ కన్నీటి పర్యంతమైంది.
సీఎం సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం..
మాది చాలా పేద కుటుంబం. ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతరు రజిత 9వ తరగతి చదువుతున్నప్పుడే తెలంగాణ కోసం ఉరేసుకొని చనిపోయింది. అప్పడు కేసీఆర్ సారు కొండంత ధైర్యం చూపిన్రు. చెప్పినట్లే తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతోపాటు నా భార్యకు ఆర్మూర్లోని బీసీ హాస్టల్లో కుక్గా ఉదోగ్యం వచ్చింది.
– గంగాధర్, తెడ్డు రజిత తండ్రి
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు
మాచారెడ్డి, జూన్ 21 : తెలంగాణ కోసం అన్ని వర్గాలు ఉద్యమం చేస్తున్న రోజులవి ..చిన్నా,పెద్ద తేడా లేకుండా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణకు వ్యతిరేక ప్రకటనలు రావడం, నాటిపాలకులు స్పందించిన తీరుతో ఇక తెలంగాణ రాదేమోనని కుమిలి పోతుండేవాడు.. కేంద్ర ప్రభు త్వ వ్యతిరేక నిర్ణయంతో మనస్తాపం చెంది న యేలేటి రంజిత్రెడ్డి 05.10.2010న ఇంట్లో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి గ్రామశివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన యేలేటి మధుసూదన్రెడ్డి-రాజమణి దంపతులకు ఇద్దరు సంతానం కాగా కొడుకు యేలేటి రంజిత్రెడ్డి, కూతురు నిఖిత. వీరికి మూడు ఎకరాల భూమి ఉండగా, బోరు లేకపోవడంతో కేవలం వర్షాధారపు పంటలను మాత్రమే పండిస్తున్నారు.
చెల్లికి ఉద్యోగంతోపాటు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం
రంజిత్రెడ్డి చెల్లెలు నిఖితకు అమరవీరుల కోటా కింద రూ.10లక్షల ఆర్థిక సహాయంతోపాటు కామారెడ్డి కలెక్టరేట్లోని రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఆ పది లక్షలను నిఖిత పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
అన్నలేడని గుర్తొస్తే బాధేస్తుంది.
అన్నలేని లోటును ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. 2018లో ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చింది. కామారెడ్డి కలెక్టరేట్లోని రెవెన్యూశాఖలో పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఈ ఉద్యోగం లేకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మా కుటుంబ పరిస్థితి బాగుపడడానికి కారణం సీఎం కేసీఆర్. అన్నలేని లోటు తీర్చిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
–యేలేటి నిఖిత, రంజిత్ సోదరి
అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి
రాజంపేట, జూన్ 21: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య పేదింటి బిడ్డ. చిన్నప్పుడే కాలం చేసిన తండ్రి, తల్లి కూలీనాలి చేసి తెచ్చే గాసమె బతుకుదెరువు. కిందా మీదా పడి డిగ్రీ చదివాడు. సగటు తెలంగాణ మట్టి బిడ్డల లెక్కనే కొలువు కోసం ఎదురుచూడగా, అదే సమయంలో దొరికింది పోలీస్ నౌకరీ. 17 ఏండ్ల వరకు సర్వీసులోనే ఉన్నాడు. 15సార్లు కమాండేషన్ అవార్డులు అందుకున్న అతడి వృత్తి నిబద్ధత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయినా ఆంధ్రా పోలీసు బాస్ల ఇష్టారాజ్యం.. తెలంగాణ వారిపై చిన్నచూపు. పనికి తగిన ప్రమోషన్లు దొరకని దుస్థితి. అదే సమయంలో మహోన్నతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమం వైపు ఆయన కన్ను పడింది. ఒక పొలీసుగా ఆంధ్రా పోలీసు బాస్ల ఆదేశాల మేరకు తెలంగాణ తమ్ముళ్లపై లాఠీలు దూయలేక విలవిల్లాడిండు. వచ్చినట్లే వచ్చి తెలంగాణ పోవుడేంది, నా ప్రమోషన్ అడ్డుకున్న ఆంధ్రోళ్లే తెలంగాణను అడ్డుకుంటున్నారని, తెలంగాణ రావాలంటే ఉద్యమం ఉవ్వెత్తున సాగాలని అందుకు తాను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకున్నాడు. నువ్వు, పిల్లలు పైలమని భార్య పద్మావతితో చెప్పిండు. పద్మావతికి ఏమీ అర్థం గాలె గొంతు పెగుల్చుకొని యాడున్నవో చెప్పు ఆడికొస్తా అన్నది. సస్తే పిల్లలేడ బోవాలె… నేనెం గావాలె అని ఏడ్చుకుంటూ అడిగింది. అయినా కిష్టయ్య మనస్సు కరగలేదు. ఫోన్ కట్ చేశాడు. కలత చెందిన పద్మావతి వెంటనే పోలీసు అధికారులకు సంగతి చెప్పింది. అందరూ వెతకడం మొదలుపెట్టారు. అదే రోజు రాత్రి కిష్టయ్య మళ్లీ ఫోన్ చేసి కామారెడ్డి హైవే పక్కన సెల్టవర్ ఎక్కిన, ఆత్మహత్య చేసుకుంటున్ననని చెప్పిండు. వెంటనే భార్యాపిల్లలు, బంధువులు, పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ఫోన్ ద్వారా మూడు గంటలు సముదాయించిండ్రు. అయినా కిష్టయ్య మనసు మారలేదు. 2009 డిసెంబర్ 1న అర్ధరాత్రి 1-45 గంటలకు సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తనువు చాలించాడు. అప్పటివరకు కేవలం సాధారణ పొలీసుగానే మెదిలిన కిష్టయ్య అమరుడైన తర్వాత తెలంగాణవాదులను నడిపించే తొవ్వ అయ్యిండు.
ఏ కష్టం రాకుండా ఆదుకున్నడు..
నా భర్త తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ చలించి పోయాడు. 2010లో చిన్న మల్లారెడ్డికి వచ్చినప్పుడు రమ్మని కబురు చేస్తే కుటుంబం మొత్తం వెళ్లి కలిసినం. ఆయన చనిపోయే నాటికి పిల్లలు రాహుల్, ప్రియాంక ఏడో తరగతి చదువుతున్నరు. కారుణ్య నియామకం చేయరాదనే అభ్యంతరాలు వచ్చినయ్. అప్పుడు కేసీఆర్ సారే అధికారులతో మాట్లాడి ఒప్పించిండు. 2010నవంబర్లో నాకు ఇంటర్మీడియట్ బోర్డులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చేలా చేసిండు. పిల్లలకు గౌతం మోడల్ స్కూల్లో చేర్పించి ఉచితంగా చదువు చెప్పించిండు. ఇంటర్మీడియట్ శ్రీగాయత్రిలో చదివించిండు. రాహుల్ ఇంటర్ చదువుతుండగా 2016 జూలైలో నిజామాబాద్లోని ఎన్సీసీ హెడ్క్వార్టర్స్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇప్పించిండు. ప్రియాంకను ఏడాదికి రూ.5లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ని చేశాడు. సీఎం అయిన తర్వాత మొదటిసారి కరీంనగర్ వచ్చినప్పుడు అధికారులందరూ ఉండగా నన్ను ప్రత్యేకంగా పిలిపించాడు. అదే రోజు కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో 200 గజాల స్థలానికి సంబంధించిన పట్టా కాగితం, డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇప్పించిండు. ప్రభుత్వం ఇచ్చిన రూ.10లక్షల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా చూసుకున్నాడు. బిడ్డ పెండ్లి కోసం ఈ పైసలు ఫిక్స్డ్ చేస్తానని కేసీఆర్ సార్కి చెబితే నీ బిడ్డ పెండ్లి నేను చేస్తా.. ఆ పైసలు ఫిక్స్డ్ చేసుకో అన్నడు. కేసీఆర్ సార్ నా కుటుంబానికి ఏ కష్టం రాకుండా తండ్రిలా ఆదుకుంటుండు. నాకు ఇంతకన్న ఏం కావాలి. నాభర్త లేడన్న లోటు తప్ప.
– పద్మావతి, కానిస్టేబుల్ కిష్టయ్య భార్య
త్యాగాలు వృథా కాలేదు..
మా నాన్నలాంటి అమరవీరుల త్యాగాలు వృథా కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇంటింటికీ నల్లా నీళ్లు, పరిశుభ్రమైన గ్రామాలు, ప్రకృతి వనాలు, ఆసరా పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. తెలంగాణ సస్యశ్యామలంగా మారడంతో మా నాన్న ఆత్మ బలిదానానికి సార్థకత చేకూరింది. ఈ సమయంలో నాన్న ఉంటే చాలా సంతోషిచేవాడు.
–రాహుల్, కిష్టయ్య కుమారుడు
సీఎం కేసీఆర్ కృషితో నాన్న కల నెరవేరింది
నన్ను డాక్టర్ చేయాలన్న మా నాన్న కన్న కలను సీఎం కేసీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్లాం. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా వెరీగుడ్ అని అభినందించారు. చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానని చెప్పారు. కరీంనగర్లోని చల్మెడ మెడికల్ కళాశాలలో ఏడాదికి రూ.5లక్షలు చెల్లించి చదివించారు. 2021లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన నేను.. అదే కాలేజీలో హౌస్సర్జన్ పూర్తిచేసి ఇప్పుడు కరీంనగర్లోని తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నా.
–డాక్టర్ ప్రియాంక
తెలంగాణ వచ్చినంక సర్కారే పెద్ద దిక్కైంది
కోటగిరి, జూన్ 21 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్ గ్రామానికి చెందిన నేరోల్ల శంకర్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 2010 ఆగస్టు 15న జెండా పండుగలో పాల్గొని ఇంటికి వచ్చాకా.. అదే రోజు రాత్రి ఇంట్లో పడుకున్న శంకర్.. సీమాంధ్ర నాయకులు పాల్గొన్న చర్చలను గుర్తుచేసుకుంటూ కలతచెందాడు. ప్రత్యేక రాష్ట్రం ఇక కలేనన్న ఆందోళనతో తీవ్ర మనోవేదనకు గురై అర్ధరాత్రి లేచి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకొని జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మంటల్లో కేకలు వేయడంతో స్థానికులు గమనించేలోపు పరిస్థితి విషమించింది. దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు.
ఆదుకున్న ‘నమస్తే తెలంగాణ’
ఉద్యమ ప్రస్థానంలో ఆసువులు బాసిన నేరోల్ల శంకర్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు ముందే ‘నమస్తే తెలంగాణ’ ఆ కుటుంబాన్ని ఆదుకున్నది. హైదరాబాద్లో మొదటి దఫాలో రూ.25 వేలు ఇవ్వగా, అమరవీరుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వాటిలో నుంచి రూ. 5 వేలు అందించింది. ఆ సమయంలో నమస్తే తెలంగాణ అందించిన ఆపన్నహస్తం వారి కుటుంబానికి ఎంతో భరోసా ఇచ్చింది.
తమ్ముడికి ప్రభుత్వ కొలువు..
నేరోల్ల శంకర్ రెండో తమ్ముడు సతీశ్కు ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో అటెండర్గా ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం సిరికొండ ప్రభుత్వ పశువైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
సాయాన్ని ఎప్పటికీ మరిచిపోను..
మా అన్న చనిపోతే కేసీఆర్ ప్రభుత్వం నాకు ప్రభుత్వ ఉద్యోగమిచ్చింది. ఆయన లేని లోటును మా కుటుంబానికి రానీయకుండా చూసుకుంటున్న. మా అన్న శంకర్ గుర్తొచ్చినప్పుడల్లా మనసు బాధైతది. మా కుటుంబానికి కేసీఆర్ సార్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనకు చెడ్డ పేరు రాకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న.
– నేరోల్ల సతీశ్, శంకర్ రెండో తమ్ముడు, పొతంగల్.