వినాయక్నగర్/ కామారెడ్డి, ఫిబ్రవరి 14: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె.రాజశేఖర్ రాజును మిర్యాలగూడ డీఎస్పీగా బదిలీ చేశారు. ఆర్మూర్ ఏసీపీ జె.జగదీశ్చందర్ను డీసీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఖమ్మం రూరల్ డీఎస్పీగా ఉన్న బి.బస్వారెడ్డిని నియమించారు.
బోధన్ ఏసీపీ కె.ఎం. కిరణ్కుమార్ను డీసీపీ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఆయన స్థానంలో పీసీఎస్ ఐటీసెల్లో విధులు నిర్వర్తిస్తున్న పి.శ్రీనివాస్కు పోస్టింగ్ ఇచ్చారు. కామారెడ్డి డీఎస్పీ ఆర్.ప్రకాశ్ను మంచిర్యాల జిల్లా రామగుండం ఏసీపీగా బదిలీచేయగా ఆయన స్థానంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న డాక్టర్ డి.రాజేశ్వర్ను నియమించారు. అధికారులు వెంటనే వారికి కేటాయించిన చోట్ల రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.