వినాయక్నగర్, జూలై 7: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి ఏడాదిక్రితం సీపీ పలు ప్రాంతాల్లో ‘వన్ వే’ ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా మరికొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద యూటర్న్ చేయకుండా రోడ్లను మూసివేయించారు. దీంతో కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గింది. అయితే స్థానిక ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి పూలాంగ్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ప్రగతినగర్ వద్ద రోడ్డు మధ్యలోని యూటర్న్ క్లోజ్ చేయించారు.
దీంతో ఎల్లమ్మగుట్ట వైపు నుంచి పూలాంగ్ వైపు వెళ్లే వాహనదారులు మధ్యలో కుడివైపు యూటర్న్ చేసేందుకు వీలు లేకుండా నిఖిల్ సాయి చౌరస్తా వరకు వన్ వే రూట్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రగతినగర్ నుంచి వచ్చే వాహనదారులు జిల్లా కోర్టు చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట వైపు వెళ్లాలంటే నిఖిల్సాయి చౌరస్తా వద్దకు వెళ్లి అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు వాహనదారులు ఇవేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రగతినగర్ కమాన్ నుంచి ఎల్లమ్మగుట్ట వైపు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ వన్వే రూట్ను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రైల్వే రూట్ ఏర్పాటు చేసిన సమయంలో కొంతకాలంపాటు ఎవరు కూడా ప్రగతినగర్ నుంచి ఎల్లమ్మగుట్ట వైపు రాంగ్ రూట్లో వెళ్లకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రగతి నగర్ కమాన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తించేవారు. కానీ ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లకుండా నియంత్రించాలని నగరవాసులు కోరుతున్నారు.