పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సర్కారు
విస్తీర్ణం ప్రకారమే లైసెన్సు ఫీజు విధింపు
ప్రతి పైసా ఖజానాకు చేరేలా కృషి
అనుమతుల మంజూరుకు అపరాధ రుసుము ఎత్తివేత
గతంలో చేతి రాతతో గందరగోళంగా వసూళ్లు
అక్రమార్కుల జేబులు నింపిన పాత పద్ధతి
ఉమ్మడి జిల్లాలో 18 వేల వ్యాపార, వాణిజ్య సముదాయాలు
రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. అక్రమాలకు తావు లేకుండా సులభంగా, వేగంగా సేవలు అందిస్తున్నది. అవినీతిమయమైన పాత విధానాలకు స్వస్తి పలుకుతూ, పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నది. ట్రేడ్ లైసెన్సుల మంజూరులోనూ కొత్త విధానం అమలు చేస్తున్నది. గతంలో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే వారు. సర్కారు ఖజానాకు గండికొడుతూ జేబులు నింపుకునే వారు. అయితే, అనేక సంస్కరణలు తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సుల మంజూరులోనూ కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. విస్తీర్ణం ప్రకారమే లైసెన్సు ఫీజు విధిస్తున్నది. పైగా అనుమతుల మంజూరుకు గతంలో ఉన్న అపరాధ రుసుమును ఎత్తివేసింది.
నిజామాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నగరపాలక, పురపాలక సంఘాల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ట్రేడ్ లైసెన్సు మంజూరుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో వ్యాపార సంస్థలను ఏ,బీ,సీ,డీ లుగా వర్గీకరించి రుసుము విధించే వారు. కొత్తగా అనుమతి పొందాలన్నా, పాతది పునరుద్ధరించాలన్నా వ్యాపార లావాదేవీల ప్రకారం వసూలు చేసేవారు. ప్రస్తుతం 147 ఉత్తర్వుల ప్రకారం రోడ్డు వెడల్పు, దుకాణం విస్తీర్ణం ప్రకారం ఫీజు తీసుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక నగరపాలక సంస్థ, 6 పురపాలక సంఘాల పరిధిలో వేలాది వ్యాపార, వాణిజ్య దుకాణ సముదాయాలు వెలిశాయి. దశాబ్ద కాలంలో వీటి సంఖ్య రెట్టింపు అయ్యింది. కానీ ఎక్కడా పురపాలక సంఘాల ఆదాయం మాత్రం పెరగలేదు. మున్సిపల్ ఉద్యోగుల కక్కుర్తి మూలంగా ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోతున్నది. కింది స్థాయిలో దుకాణాదారులతో అంటకాగడం ద్వారా నిలిచిన ఆదాయ మార్గాలను ప్రభుత్వం పారదర్శకత, కచ్చితత్వంతో వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. అవినీతిపరుల చేష్టలకు చెక్ పెడుతూ ప్రతి పైసా సర్కారు ఖజానాకే జమ అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంత కాలంగా ట్రేడ్ లైసెన్సులను కొత్త పద్ధతిలో తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కొంత మంది ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో అపరాధ రుసముతో గడువు పెంచా రు. తాజాగా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అపరాధ రుసుమును ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించడంతో సంబంధిత వర్గాల్లో ఊరట దక్కుతున్నది.
10వేల మందికి ట్రేడ్ లైసెన్సులు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘాలున్నాయి. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్లో 380 ట్రేడ్ లైసెన్సులు జారీ అయ్యాయి. చాలా మంది ట్రేడ్ సైసెన్సులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో 466, బోధన్లో 38, ఆర్మూర్లో 192, భీమ్గల్లో 9, బాన్సువాడలో 19 ట్రేడ్ లైసెన్సులు జారీ కాగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఒక్కటి జరుగకపోవడంతో శూన్యంగా మిగిలింది. వ్యాపార అనుమతుల నిమిత్తం ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని, పాతవి రెన్యువల్ చేసుకోవాలని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1,102 దుకాణాదారులు మాత్రమే నిర్ణీత చార్జీలు చెల్లించి ధ్రువపత్రాలు పొందారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 18వేలకు పైగా వ్యాపార కేంద్రాలున్నాయి. ఇందులో గతేడాది 10,520 మంది ట్రేడ్ లైసెన్సులు పొందారు. ప్రస్తుతం ఇందులో కొద్ది మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. మిగిలిన వారికి పురపాలక సంఘాల ఆధ్వర్యంలో నోటీసులు జారీ అయ్యాయి.
గడువు పెంపు…
రాష్ట్రంలో ట్రేడ్ లైసెన్సులను ఎలాంటి జరిమానా లేకుండా అక్టోబర్ వరకు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం సంబంధిత వర్గా ల్లో ఊరటను కలిగిస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి ట్రేడ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోకుండా వ్యాపారం చేస్తూ జూన్లోపు చేసుకుంటే 25శాతం, జూన్ తర్వాత అక్టోబర్లోపు చేసుకుంటే 50శాతం జరిమానా చెల్లించాల్సి ఉండేది. తాజా ఉత్తర్వులతో అక్టోబర్ వరకు ఎలాంటి జరిమానా లేకుండా రెన్యువల్ చేసుకునేలా పురపాలక శాఖ అవకాశం కల్పించింది. ఇప్పటికే ఏప్రిల్ ఒకటి తర్వాత జరిమానాలు చెల్లించి రెన్యువల్ చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని వచ్చే ఏడాది రెన్యువల్ సమయంలో సర్దుబాటు చేయనున్నట్లు ఆ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. భువన్ యాప్ ద్వారా సేకరించిన సమాచారంతో పన్నులను క్రమబద్ధీకరించారు. కొలతల ఆధారంగా ట్రేడ్ లైసెన్సులను నిర్ణయించడంతో వ్యాపారులు ఇప్పుడు కంగుతింటున్నారు. గతంలో కన్నా ఈసారి రెట్టింపు కావడంతో పన్నులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. దీనికి తోడు ప్రతి లైసెన్సుకు అదనంగా రూ.వెయ్యి హరిత పన్ను విధిస్తున్నారు. బ్యాంకు రుణాలు పొందాలనుకునే వారికి ట్రేడ్ లైసెన్సు అవసరం కావడంతో వీళ్లు మాత్రమే నగర, పురపాలికల్లో తమ దుకాణాలను నమోదు చేసుకుంటున్నారు.
నిధుల పక్కదారికి అడ్డుకట్ట…
పట్టణ, నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలను తీసుకుంటున్నది. ఇందులో భాగంగా శాస్త్రీయ పద్ధతుల్లో ఇంటి, వాణిజ్య భవనాల విస్తీర్ణాన్ని ఇప్పటికే భువన్ యాప్ ద్వారా లెక్కించి రికార్డుల్లో పొందుపర్చింది. తద్వారా గతంలో పాత నిర్మాణాలకు చెల్లిస్తూ వచ్చినా పన్నులు ఇప్పుడు నిబంధనల ప్రకారం కచ్చితమైన నిర్మాణాలకు ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. అచ్చంగా ఇదే మాదిరిగానే ట్రేడ్ లైసెన్సులను సైతం సర్కారు క్రమబద్ధం చేసింది. ఇందులో పాత పద్ధతికి పూర్తిగా చెక్ పెట్టింది. గతం లో పురపాలక సంఘంలోని సంబంధిత విభాగం బాధ్యులది ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లుగా ఉండేది. చాలా మంది ట్రైడ్ లైసెన్సులు లేకుండానే మున్సిపల్ సిబ్బందితో కుమ్మక్కై పన్నులు చెల్లించేది కాదు. ఇప్పుడు సర్కారు వద్ద భువన్ యాప్ రూపంలో సమాచారం నిక్షిప్తమై ఉండడంతో అక్రమార్కుల అవినీతి లీలలకు అడ్డుకట్ట పడింది. తద్వారా వ్యాపార, వాణిజ్య సముదాయాలకు చెందిన యజమానులు తప్పనిసరిగా నిర్ణీత విస్తీర్ణాన్ని అనుసరించి ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. లేదంటే చట్టం ప్రకారం వారంతా శిక్షార్హులుగా మిగిలే ఆస్కారం ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు.