అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి అపురూప వేడుక రక్షాబంధన్. హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ అంటారు. దీనినే సంస్కృతంలో రక్షికా పౌర్ణిమ అంటారు. రక్ష అనగా సంరక్షణ అని అర్థం. దీంతోపాటు జంధ్యధారణకు ప్రత్యేకత ఉన్నది. ఈ రోజున నూతన జంధ్యాన్ని ధరించడంతో దివ్యమైన తేజస్సు లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. సోదరీమణులు,వారి సోదరులకు రాఖీలను కట్టి ఆత్మీయతను చాటిచెప్పే పండుగ. గురువారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల నుంచే పట్టణాల్లోని బ్యాంగిల్ స్టోర్స్, జనరల్ స్టోర్ల వద్ద రాఖీ సెంటర్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. మిఠాయి దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడిగా నెలకొన్నది.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా రైల్వేస్టేషన్రోడ్ గీతాభవనంలో గీతాయజ్ఞం, మాధవనగర్ సాయిబాబ, తేనెసాయి మందిరం, దేవీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు, సామూహిక రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోనున్నారు. దీంతో ఆలయాలు శ్రావణ శోభ సంతరించుకున్నాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి ఆవుపేడతో చేసిన రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. గోమయంతో చేసిన రాఖీలను అందరూ వినియోగించాలని గోసేవ ప్రేమికులు కోరుతున్నారు. ఆవుపేడతో తయారైన రాఖీలు భూమిపై వేసినా, నీళ్లల్లో వేసినా పర్యావరణ పరిరక్షణ ఏర్పడుతుంది. పలు విద్యాసంస్థల్లో గోమయంతో చేసే రాఖీలను పిల్లలతో తయారు చేయించారు. గోమయ రాఖీలు రూ. 10 నుంచి రూ. 60 వరకు అందుబాటులో ఉన్నాయి.
శ్రావణ పౌర్ణిమ రోజు తలంటు స్నానము ఆచరించి ముందుగా దేవతలు, తల్లిదండ్రులను పూజించాలి. మధ్యాహ్న సమయంలో రక్షను సిద్ధం చేసుకొని స్త్రీలు గృహ మధ్యలో అలికి పీట వేసి తమ సోదరులను కూర్చోబెట్టి రక్షను కట్టాలి. రాఖీ కట్టేముందు నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా మనందరం దేశానికి రక్షా అని అనుకుంటూ ఆ బంధాన్ని కట్టాలి. అనంతరం నోటిని తీపి చేయాలి. అలా ఆడపడుచులతో వేడుకలా చేసుకునే గొప్ప సనాతన భారతీయ సంస్కృతి మనది.
తనకి ప్రాణసమానమైన సోదరులు శత సంవత్సరాలు సుఖంగా ఉండాలనీ, తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ సోదరీమణులు ఎంతో అప్యాయతతో కట్టే ఆ రక్షబంధనం ఎప్పటికప్పుడు సృజనాత్మకత ఆలోచనలని సంతరించుకొని ఎన్నో సొబగుల్ని అద్దుకొని సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని రాఖీ దుకాణాల్లో రాఖీ విక్రయాలు జోరందుకున్నాయి. చిన్నారుల కోసం చోటాభీం, హనుమాన్, మిక్కీమౌస్, బుక్మార్క్ కీచైన్ రాఖీలు, బ్రో, బాయ్ అన్న అక్షరాలతోనూ వినాయకుడు, లక్ష్మీదేవీ తదితర రూపాల్లో ఉన్న రాఖీలు రూ. 20 నుంచి రూ. 2వేల వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
సేంద్రియంగా తయారైన రాఖీలను వినియోగిస్తే మంచిది. సిల్క్, కాటన్ దారాలు, రంగురాళ్ల మెరుపులు ఇతరత్రా ప్లాస్టిక్ పదార్థాలతో చేసే రాఖీలు పర్యావరణానికి హానిచేస్తాయి. ఈసారి గోమయ రాఖీలను వినియోగించేలా పలు స్వచ్ఛంద సంస్థలు, గోసేవా సంస్థలు కృషి చేస్తున్నాయి.
– పోకల శ్రీనివాస్ గుప్తా, గో సేవకుడు ,నిజామాబాద్