సుభాష్నగర్, ఏప్రిల్ 8: తెలుగు సంవత్సరాది నేడు ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. మంగళవారం క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో పంచాంగ శ్రవ ణం, ఉగాది పచ్చడి వితరణ, కవి సమ్మేళనాలు తదితర ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉగాస్య ఆది ఉగాది. ఉగా అనగా నక్షత్రగమనం. జన్మ నక్షత్రం అనుసరించి నవనాయకుల నిర్ణయం మేరకు కొత్త సంవత్సరంలో తిథి, వార, నక్షత్రాలను తెలుసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు శ్రీరామ చంద్రుడు రాజ్య పట్టాభిషేకం చేశారని, ప్రకృతి పరంగా ఉగాది మనిషిలోని మానవత్వాన్ని ఆరోగ్య రక్షణకు ఉగాది పచ్చడిని సేవించడం ఆనవాయితీ. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉండగా, 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగా కోపం అని అర్థం. ఈ సంవత్సరం నవనాయకుల్లో ఏడుగురు ఆశుభంగాను ఇద్దరు శుభంగాను ఉండడంతో అకాల వర్షాలు, యుద్ధ భయాలు, రాజుకు ప్రజలకు మధ్య వ్యతిరేకత తదితర అశుభ ఫలితాలున్నాయని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు.
ఉగాది పర్వదినం పురస్కరించుకొని సోమవారం సాయంత్రం నుంచి మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పూలు, పండ్లు, మామిడికాయలు, మామిడికొమ్మలు, వేపపువ్వు, తాజా చింతపండు, బెల్లం తదితర పండుగ సామగ్రిని కొనుగోలు చేసేందుకు జనం పెద్ద సంఖ్యలో డైలీ, వీక్లి మార్కెట్లకు తరలిరావడంతో కిటకిటలాడాయి.
బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 8: ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.