కోటగిరి, ఫిబ్రవరి 22: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొల్లూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గజాజన్ మహరాజ్ ఆల యం ఏడో వార్షికోత్సవానికి సర్వం సిద్ధమైం ది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన రెండు సద్గురు గజానన్ మహరాజ్ ఆలయాల్లో ఒకటి కొల్లూర్లో ఉండడం విశేషం. తెలంగాణ, మహారా ష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గజానన్ మహరాజ్ భక్తగణం పెద్ద సంఖ్యలో ఉండడం ఇందుకు కారణమని భక్తుల భావన. మరో ఆలయం మహారాష్ట్రలోని శెగావ్లో ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు. కొల్లూర్ గ్రామంలో ఏడేండ్ల క్రితం కేవలం ఒక గుడిసెలో మహరాజ్ చిత్రపటంతో పూజా పురస్కారాలు కొనసాగేవి. గజానన్ మహరాజ్ భక్తులు సనాతన ఆచారాన్ని అనుసరించి మత్తు పదార్థం సేవిస్తూ మహరాజ్ను కొలిచేవారని ప్రతీతి. కొల్లూర్లో ఆలయ నిర్మాణానికి స్థానిక భక్తుడు మల్లెపూల రామాగౌడ్ 11 గుంటల సొంత స్థలాన్ని వితరణ చేశాడు. 2015వ సంవత్సరంలో గజానన్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం దక్షిణ దేశ వైష్ణవ పీఠాధిపతి స్వామి రామానంద తీర్థాచార్యుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రగాఢ దివస్, శ్రీరామనవమి, గురుపౌర్ణమి, ఋషి పంచమి, దత్త జయంతి పర్వదినాల్లో హోమం, యజ్ఞయాగాలు, పూజలు, జాతర కొనసాగుతాయి. ఈ వార్షికోత్సవానికి ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
శ్రీ గజానన్ ఆలయ ఏడో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు గజానన్ బాబాకు అభిషేకం, హారతి, 9 గంటలకు మహాగణపతి హోమం, మధ్యాహ్నం 12 గంటలకు హారతి,12.30 గంటలకు అన్నదానం, సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ ఉంటుందని పేర్కొన్నారు.