సుభాష్నగర్/వినాయకనగర్, ఏప్రిల్ 1: హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో అంజన్న ఆలయాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుద్దీపాల్లో వెలిగి పోతున్నాయి. వీర హనుమాన్ విజయ యాత్రలకు సన్నాహాలు సైతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సహా పలు ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించనున్నారు. నగరంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, ఇతర హిందూ సంఘాలు గురువారం భారీ స్థాయిలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాయి.
ఈ యాత్రలో ఆరు రథాలపై ఆరు విగ్రహాలను ఊరేగించనున్నారు. హనుమంతుడు, శ్రీరాముడు, ఛత్రపతి శివాజీ, భరతమాత, దత్తాత్రేయుడు, మహాశివుని విగ్రహాలతో రథాలు సిద్ధం చేస్తున్నారు. వీర హనుమాన్ శోభాయాత్ర కంఠేశ్వర్ ఆలయం నుంచి జిల్లా పరిషత్, నాందేవ్వాడ, శివాజీచౌక్, గంజ్, దేవిరోడ్, గాంధీచౌక్, పెద్దబజార్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తా, శివాజీ విగ్రహం వరకు కొనసాగనుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు.
హనుమాన్ శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం 1300 మంది సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. శోభాయాత్ర సాగే దారి పొడవునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. హనుమాన్ శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు నిర్వాహకులు, భక్తులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ప్రతిఒక్కరూ స్నేహభావంతో ఉండాలని సీపీ సూచించారు.