నందిపేట్/నవీపేట, మార్చి 23: వేర్వేరు చోట్ల నీటమునిగి ముగ్గురు మృతి చెంది న ఘటన నందిపేట, నవీపేట మండలాల్లో శనివారం చోటు చేసుకున్నది. నందిపేట్ మండలం తల్వేద వాగులో కౌల్పూర్ గ్రామ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండారి రవి (20) స్నేహితులతో కలిసి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. డొంకేశ్వర్ గ్రామానికి చెందిన సుంకరి పెద్ద గంగారాం (44) అనే పశువుల కాపరి చెరువులోకి దిగిన పశువులను బయటికి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.
నవీపేట మండల కేంద్రంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న అలీసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి బహదూర్ కాలనీకి చెందిన షేక్ మోసిన్(13) అనే విద్యార్థి మృతి చెందాడు. తోటి విద్యార్థులతో కలిసి కాలువలో స్నానం చేసేందుకు వెళ్లగా ఈత రాక మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ చెప్పారు. మృతుడి తండ్రి హైమద్ ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.