నవీపేట, జనవరి 3: నవీపేటలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపింది. రోజులానే గురువారం ఇంటి నుంచి బయల్దేరిన పదో తరగతి విద్యార్థినులు బడికి డుమ్మా కొట్టారు. ఉచిత ప్రయాణాన్ని వాడుకుని ఆర్టీసీ బస్సుల్లో రోజంతా చక్కర్లు కొట్టారు. బడికి రాలేదని టీచర్లు ఫోన్ చేయడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెతికీ వెతికీ చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై వినయ్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 24 గంటల్లోనే పిల్లల ఆచూకీ కనిపెట్టి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ తమ పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నవీపేట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో.. చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాలికలు పదో తరగతి చదువుతున్నారు.
గురువారం ఉదయం స్కూల్కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన ఆ ముగ్గురు బడికి డుమ్మా కొట్టారు. ఉచిత బస్సు పథకంలో భాగంగా రోజంతా బస్సుల్లో తిరగాలని ముందుగానే నిర్ణయించుకొని, ఆధార్ కార్డులను వెంట తెచ్చుకున్నారు. స్కూల్ బ్యాగులను ఎక్కడో పడేసి నవీపేట బస్టాండ్కు చేరుకున్నారు. బస్సు ఎక్కి తొలుత బోధన్కు, అక్కడి నుంచి మళ్లీ నవీపేట్ మీదుగా నిజామాబాద్ చేరుకున్నారు. కామారెడ్డి బస్సెక్కి అక్కడికి వెళ్లి తిరిగి నిజామాబాద్కు వచ్చారు. అటు నుంచి నవీపేట్కు వెళ్లి మళ్లీ నిజామాబాద్కు వచ్చారు. ఇక్కడి నుంచి జగిత్యాలకు వెళ్లి తిరిగి నిజామాబాద్కు చేరుకున్నారు.
అయితే, బాలికలు స్కూల్కు రాలేదని టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, పొద్దున్నే ఇంటి నుంచి బయల్దేరారని వారు బదులిచ్చారు. స్కూల్కు రాలేదని టీచర్లు స్పష్టం చేయడంతో కంగారు చెందిన తల్లిదండ్రులు రోజంతా వెతికారు. ఆచూకీ దొరకక పోవడంతో గురువారం రాత్రి నవీపేట్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గాలించారు.
అదృశ్యమైన బాలికల్లో ఒకరి దగ్గర ఫోన్ ఉండడంతో, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను గురువారం రాత్రి నిజామాబాద్ బస్టాండ్లో పట్టుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. నవీపేట ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిజామాబాద్ బస్టాండ్లో తిష్ట వేశాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు బాలికలు బస్సు దిగుతుండగా గుర్తించారు. వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఉచిత బస్సు పథకం మరోమారు చర్చనీయాంశమైంది.