లింగంపేట, మార్చి11: మండలంలోని ఎల్లారం గ్రామ రహదారి పక్కన ఉన్న ఆధునిక వ్యవసాయ మార్కెట్ గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు లక్షల గన్నీ బ్యాగులు కాలిపోయినట్లు జిల్లా సివిల్ సైప్లె డీఎం అభిషేక్ తెలిపారు. ఆయన గోదామును శనివారం పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం గోదాం నుంచి పొగలు రావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. శనివారం ఉదయం గోదాముకు రెండు వైపులా ఉన్న షట్టర్లను తొలగించి కాలిపోయిన గన్నీ సంచులను ట్రాక్టర్ల సహాయంతో బయటికి తీశారు.
మూడు విభాగాల్లో 26లక్షల గన్నీ సంచులు నిల్వ ఉంచగా.. ఒక విభాగంలోని పది లక్షల గన్నీ సంచుల నుంచి మూడు లక్షల సంచులు కాలిపోయినట్లు డీఎం తెలిపారు. నూతన గన్నీ సంచుల్లో ఉన్న రసాయనాలతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. మూడు లక్షల గన్నీ సంచులు కాలిపోవడంతో సుమారు రూ.2.25 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి గౌతమ్, మార్కెటింగ్ విభాగం డీఈఈ మహేందర్, ఏఈ దయానంద్, లింగంపేట సహకార సంఘం సీఈవో సందీప్ తదితరులు సందర్శించారు. స్థానిక ఎస్సై శంకర్ పరిస్థితిని సమీక్షించారు.