బైక్ను ఢీకొట్టిన లారీ..
ముగ్గురు యువకుల మృత్యువాత
మృతులు సంగారెడ్డి జిల్లావాసులు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాన్సువాడ డీఎస్పీ, సీఐ
పిట్లం, జూన్ 13 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గద్దగుండు తండా సమీపాన 161 జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన పాండురంగ్(15) అతని సోదరుడు విజయ్ (20) తమ స్నేహితుడైన కంగ్టి మండలం గాంధీనగర్కు చెందిన సతీష్(19)తో సోమవారం శంకరంపేట్కు బయల్దేరారు.
పాండురంగ్ శంకరంపేట్లో ఎస్సెస్సీ పూర్తి చేశాడు. టీసీ నిమిత్తం ముగ్గురు కలిసి బైక్పై బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి, సీఐ మురళి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు. యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో వారి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.