కమ్మర్పల్లి/మెండోరా, సెప్టెంబర్ 5 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది. జూన్లో వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందిన ప్రాజెక్టు ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో పునరుజ్జీవ పథకంతో కాళేశ్వరం జలాలను తెచ్చి ఎస్సారెస్పీలో నింపే ప్రక్రియను చేపట్టారు. ఇదే సమయంలో ప్రారంభమైన భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ సీజన్లో మూడు సార్లు లక్షకు పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరింది.
జూన్ మాసంలో ప్రాజెక్టు పరిధిలో, ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో గానీ వర్షాలు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం జలాలను తెచ్చి ప్రాజెక్టును నింపుకోవడం ప్రారంభించిన వారం రోజుల్లోపే భారీ వర్షాలు మొదలయ్యాయి. ఈ మాసంలోనే ఇన్ఫ్ల్లోలు రెండు పర్యాయాలు లక్ష క్యూసెక్కులు దాటాయి. ఈ భారీ వరద రాకతో 93 టీఎంసీల జలాలు ప్రాజెక్టులోకి వచ్చి ప్రాజెక్టును నిండు కుండలా మార్చాయి. భారీ వరద కారణంగా జూలైలో గోదావరిలోకి వదిలిన మిగులు జలాలు, కాలువలు, జెన్కో, మిషన్ భగీరథకు వదిలిన మొత్తం అవుట్ఫ్లో 38.74 టీఎంసీలుగా నమోదైంది. ఆగస్టు మాసంలో అంతంత మాత్రమే వర్షాలు కురిశాయి. కేవలం 29 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చాయి.
సెప్టెంబర్లో కూడా మామూలు ఇన్ఫ్లోలు వస్తాయనే ఆందోళన రైతుల్లో మొదలైంది. అలాంటి పరిస్థితే వస్తే పునరుజ్జీవ పథకం ఉండనే ఉంది కదా అని భరోసా ఆందోళనను దూరం చేసింది. కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే మళ్లీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవార ఉదయానికే ఇన్ఫ్లో 50 వేల 924 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 12,480 క్యూసెక్కులను దిగువకు గోదావరి లోకి వదిలారు. దీంతో సోమవారం సాయంత్రానికల్లా ఎస్సారెస్పీ 1091 అడుగులు, 90.313 టీఎంసీలతో పూర్తిస్థాయి నీటి మట్టంతో కొనసాగింది. ఇదే రాత్రి ఇన్ఫ్లో 43, 670 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో మళ్లీ 16 గేట్ల ద్వారా 49,920 క్యూసెక్కులకు నీటిని దిగువకు వదిలారు. మంగళవారం ఉదయం తర్వాత ఇన్ఫ్లో సీజన్లో మూడో సారి లక్ష్య క్యూసెక్కులు దాటింది. లక్షా 14 వేల 38 క్యూసెక్కుల రాకతో మంగళవారం 26 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను 99 వేల 920 క్యూసెక్కులకు పెంచారు. సాయంత్రం 64,038 క్యూసెక్కులకు వరద తగ్గుముఖం పట్టడంతో 16 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 5 వేల క్యూసెక్కుల మిగు లు జలాలను విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్ : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 35వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ఐదు వరద గేట్ల ద్వారా 35000 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీల కెపాసిటీకి గాను 1404.52 అడుగులు 17.10 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.