విద్యానగర్, జనవరి 14 : కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రాజంపేట్, లింగాపూర్, అడ్లూర్, టేక్రియాల్ ప్రాం తాలకు చెందిన రైతులతో శనివారం లింగాపూర్లోని మైసమ్మ ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్చైర్పర్సన్ ఇందూప్రియ, బీఆర్ఎస్ నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు మాట్లాడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. రైతులు ఇచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వారికి మద్దతుగా తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రైతులకు అండగా నిలుస్తామని చెప్పారని గుర్తుచేశారు. రెండు పంటలు పండే భూముల్లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఏర్పాటు చేయడం జరగదని స్పష్టం చేశారు. లింగాపూర్ నుంచి దేవునిపల్లి మీదుగా కామారెడ్డి చెరువు వరకు 100 ఫీట్లు, లింగాపూర్ నుంచి వెళ్లే 80 ఫీట్ల వరకు ప్రతిపాదిత రోడ్ల విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, తొలగించే విధంగా మున్సిపల్ తీర్మానం చేస్తుందని తెలిపారు. అన్ని గ్రామాల రైతులతో మాట్లాడి అపోహలు తొలగించడంతోపాటు ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్లను తొలగిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానం కాపీని ఆయా గ్రామాల రైతులు, వీడీసీ ప్రతినిధులకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అందజేశారు. తీర్మానానికి అనుగుణం గా చేయకపోతే రాజీనామాకు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, చంద్రశేఖర్ రెడ్డి, విలీన గ్రామాల కౌన్సిలర్లు, నాయకులు, వీడీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.