ఖలీల్వాడి, జనవరి 25: కొవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కరోనా, డెల్టా వైరస్తో చాలా మరణాలు సంభవించాయి. దీంతో ఏ వేరియంట్ వ్యాప్తి చెందుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డెల్టా వైరస్ సోకిన వారు లక్షల రూపాయలు ఖర్చుచేసినా ప్రాణాలు నిలువలేదు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలన్నీ రోగులతో కిక్కిరిసిపోయాయి. రెమిడెసివిర్ ఇంజక్షన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకున్నది. ఇందుకోసం రాష్ట్రంలో ఇంటింటి జ్వర సర్వేను చేపట్టింది. వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. సర్వే నిర్వహిస్తూ.. కరోనా లక్షణాలు ఉన్నవారికి ఇంటి వద్దనే మందుల కిట్లు అందజేశారు. దీంతో కరోనా అదుపులోకి వచ్చింది.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలపై ప్రభావం చూపుతున్నది. దీంతో మరణాలు సంభవిస్తాయని ప్రజలు భయపడ్డారు. కానీ వైద్యులు మాత్రం ప్రజలకు శుభవార్త చెప్పారు. ఒమిక్రాన్తో ప్రాణనష్టం లేదని స్పష్టంచేశారు. ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఐదు రోజుల్లోనే తగ్గుతుందని తెలుపుతున్నారు. అయినా ఇంటింటి సర్వేను కొనసాగిస్తూ కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్, బెడ్ల ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.
దవాఖానకు తగ్గిన రద్దీ..
డెల్టా వైరస్ కారణంగా నిజామాబాద్లోని ప్రభుత్వ దవాఖానలోని 521 బెడ్లు రోగులతో నిండిపోయాయి. పలువురు ప్రైవేటు దవాఖానలకు పరుగులు తీశారు. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ సోకిన వారు దవాఖానలో చేరడం లేదు. ఇంటి వద్దనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ నుంచి త్వరగా కోలుకుంటున్నారు. ప్రైవేటు దవాఖానలకు పరుగులు తీసి లక్షల రూపాయలను ఖర్చు చేసుకోవడం లేదు. పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వం అందజేస్తున్న మందుల కిట్లతో పూర్తిగా కోలుకుంటున్నారు. డెల్టా వైరస్తో పోలిస్తే ఒమిక్రాన్తో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. డెల్టా వైరస్తో జిల్లాలో వందకు పైగా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మరణాలు లేవు. ఎవరు కూడా అత్యవసరంగా దవాఖానల్లో చేరడం లేదు.
ఒమిక్రాన్ లక్షణాలు ఇవే..
జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతులో ఇబ్బందులు, జలుబు, దగ్గు, విరేచనాలు, నీరసం, ఏమీ తినాలనిపించకపోవడం.
వ్యాక్సినేషన్లో దూకుడు..
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సినేషన్లో నిజామాబాద్ జిల్లా మొదటిస్థానంలో ఉన్నది. ఇప్పటికే 98శాతం టీకాల పంపిణీని పూర్తిచేశారు. టీనేజర్లకు సైతం వ్యాక్సిన్ వేయడం చివరి దశకు చేరుకున్నది.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
వైరస్ ప్రభావంతో చాలా మంది మరోసారి కరోనా బారిన పడుతున్నారు. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కును ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని వివరిస్తున్నారు. ఈమేరకు గ్రామాల్లో తిరుగుతున్న ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.