పెద్ద కొడప్గల్, మార్చి 11: శనగ కొనుగోళ్లపై స్పష్టత కరవైంది. రైతులు సాగుచేసిన శనగ పంటకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత కరువైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని కొంతమంది రైతులు వాపోతున్నారు.
తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు
ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మద్దతు ధర (రూ.5,875) లభిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు నిరాశ తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేక పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు, కుటుంబ అవసరాల కోసం దళారులకు రూ.4,900 నుంచి రూ.5,300 వరకు విక్రయించి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనగ పంట సాగు చేయడానికి పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడి తక్కువగా వచ్చి సుమారు ఎకరానికి రూ.5,600 ఖర్చయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర లేక నష్టపోతున్నామని వాపోతున్నారు.
కేసీఆర్ పాలనలో త్వరగా కొనుగోళ్లు
కేసీఆర్ పాలనలో పంట కోతకు వచ్చే సమయంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది. దీంతో రైతులకు శనగ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రాజ్యమేలుతున్నారు. రైతులు నిల్వ సౌకర్యం లేక, చేసిన అప్పుల ఒత్తిడితో పంటను అమ్ముకోవాల్సి వస్తున్నది. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని దళారులు తక్కువ ధరకే శనగలు కొనుగోలు చేసి, సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు తరలిస్తున్నారు. అక్కడ ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
తక్కువ ధరకే కొంటున్నారు.
మూడెకరాల్లో శనగ వేయగా, 23 క్వింటాళ్ల పంట వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్లో వ్యాపారులు తక్కువ ధర అంటే రూ.5,100లకే అడుగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముందుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పంటను సేకరించేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. తక్కువ ధరకే అమ్మి రైతులు నష్టపోతున్నారు.
-మోల్లా ఆఫ్రోజ్, రైతు, పెద్ద కొడప్గల్
ఉన్నతాధికారులకు నివేదికను అందించాం..
శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేశాం. ఎన్సీసీ వారి నుంచి అనుమతులు రాగానే కేంద్రాలు ఏర్పాటు చేసి శనగలు కొనుగోలు చేస్తాం.
-శశిధర్, మార్క్ఫెడ్ డీఎం